Ramayana Skit in IIT Bombay: రామాయణాన్ని కించపరుస్తూ నాటకం వేసిన 8 మంది ఐఐటీ బాంబే విద్యార్థులకు యాజమాన్యం భారీ జరిమానా విధించింది. మత విశ్వాసాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరించినందుకు ఒక్కొక్కరికీ రూ.1.2 లక్షల ఫైన్ వేసింది. మార్చి 31వ తేదీన కాలేజ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కొంత మంది విద్యార్థులు Raahovan పేరుతో ఓ స్కిట్ వేశారు. రామాయణానికి ఇది పేరడీ. అయితే కొంత మంది విద్యార్థులు ఈ నాటకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మత విశ్వాసాలను దెబ్బ తీశారని మండి పడ్డారు. హిందువులు ఎంతో గొప్పగా భావించే రామాయణాన్ని కించపరిచారని ఫిర్యాదు చేశారు. దీనిపై క్రమశిక్షణా కమిటీ తీవ్రంగా స్పందించింది. భారీ జరిమానాలు విధిస్తూ జూన్ 4వ తేదీన ఆదేశాలిచ్చింది. 8 మంది ఈ స్కిట్ వేయగా వాళ్లలో నలుగురికి రూ.1.2 లక్షల జరిమానా విధించగా మరో నలుగురికి ఒక్కొక్కరికీ రూ.40 వేల ఫైన్ వసూలు చేసింది. మరి కొన్ని ఆంక్షలూ విధించింది. హాస్టల్‌ నుంచి డిబార్ చేసింది. మరో నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని తేల్చి చెప్పింది యాజమాన్యం. ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 


ఏప్రిల్ 8వ తేదీన ఈ వివాదం రాజుకుంది. రామాయణానికి పేరడీ అని చెప్పి నాటకం వేశారు విద్యార్థులు. తమకు అనుకూలంగా మార్చుకుని అందులోని పాత్రల్ని అవమానించారని ఓ వర్గం ఆరోపించింది. ఈ స్కిట్‌కి సంబంధించిన వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీత పాత్ర వేసిన మహిళ తనను కిడ్నాప్ చేసిన వ్యక్తిని పొగడడం, ఆమెని తీసుకెళ్లిన చోటు చాలా బాగుందని చెప్పడం లాంటివి కొందరికి అసహనం కలిగించాయి. 


Also Read: Tamil Nadu Hooch Tragedy: అలాంటి వాళ్లని ఊరికే వదిలే ప్రసక్తే లేదు - కల్తీ మద్యం ఘటనపై తమిళనాడు సీఎం సీరియస్