QUAD Summit: 'క్వాడ్' సదస్సులో శాంతి మంత్రం.. వ్యాక్సిన్ సరఫరా, ప్రపంచ భద్రతే లక్ష్యం

ABP Desam   |  Murali Krishna   |  25 Sep 2021 04:56 AM (IST)

ప్రపంచానికి మేలు చేసే శక్తిగా క్వాడ్ కూటమి ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. క్వాడ్ సదస్సులో ఆస్ట్రేలియా, అమెరికా, భారత్, జపాన్ దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చించారు.

క్వాడ్ కూటమి

ఆస్ట్రేలియా, అమెరికా, భారత్​, జపాన్ దేశాల 'క్వాడ్' సదస్సు శ్వేతసౌధంలో దాదాపు 4 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ప్రపంచ దేశాల మేలు కోరే ఓ శక్తిగా క్వాడ్ కూటమి నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​, జపాన్ ప్రధాని యొషిహిదే సుగా పాల్గొన్నారు.

2004లో వచ్చిన సునామీ తర్వాత మన నాలుగు దేశాలు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇప్పుడు కరోనా సంక్షోభంలో మళ్లీ భేటీ అయ్యాం. ప్రపంచ శ్రేయస్సుకోసమే ఈ సమావేశం. క్వాడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఇండో-పసిఫిక్ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్ మరింత ముందుకు వెళ్లాలి. సరఫరా గొలుసు, ప్రపంచ భద్రత, వాతావరణ మార్పులు, కొవిడ్‌పై యుద్ధం సహా పలు అంశాలపై నా స్నేహితులతో మాట్లాడటం ఆనందంగా ఉంది.                            - ప్రధాని నరేంద్ర మోదీ     
 

వ్యాక్సిన్‌లపై చొరవ..

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యాక్సినేషన్‌పై క్వాడ్ తీసుకుంటున్న చొరవను ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ముఖ్యంగా భారత్ ఇందుకోసం మరింత కృషి చేస్తుందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనున్నట్లు మోదీ స్పష్టం చేశారు.

బైడెన్ కీలక ప్రకటన..

క్వాడ్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. క్వాడ్​ దేశాల్లోని విద్యార్థులు.. అమెరికాలో 'స్టెమ్'​ కార్యక్రమాల్లో అడ్వాన్స్‌డ్ డిగ్రీ విద్యను అభ్యసించేందుకుగాను క్వాడ్ ఫెలోషిప్​ను ప్రకటించారు. ప్రపంచ అవసరాల కోసం భారత్​లో 100 కోట్ల కొవిడ్ టీకా డోసులు ఉత్పత్తి చేసేందుకు క్వాడ్ దేశాలు కృషి చేస్తున్నాయని బైడెన్ తెలిపారు.

ఆరు నెలల క్రితం మన మధ్య జరిగిన భేటీలో స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్​ ప్రాంత ఏర్పాటుకు కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నాం. ఆ దిశగా మీరంతా పనిచేస్తున్నారని చెప్పడానికి గర్విస్తున్నాను. మన తరంలో ఎదురైన ప్రతి సవాలును క్వాడ్ కూటమి ధైర్యంగా ఎదుర్కొంటోంది.                    - జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

సవాళ్లు పరిష్కరించాలి..

అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొనాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ అన్నారు. ఈ ప్రాంతంలో సార్వభౌమ హక్కలకు భంగం వాటిల్లకూడదని క్వాడ్ సదస్సులో తెలిపారు. 

ఇండో పసిఫిక్ ప్రాంతం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవడం క్వాడ్ దేశాలు ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో సవాళ్లు కూడా ఎదురవతున్నాయి. వీటిని పరిష్కరించి క్వాడ్ మరింత శక్తిమంతగా ముందుకు సాగాలి.                     - స్కాట్​ మోరిసన్​, ఆస్ట్రేలియా​ ప్రధాని

దృఢమైన బంధానికి ప్రతీకగా..

ప్రజాస్వామ్య విలువలను గౌరవించే మన నాలుగు దేశాలు తీసుకున్న ప్రధానమైన చొరవ.. ఈ క్వాడ్ కూటమి. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసేమే మా కృషి. కరోనాపై యుద్ధంలోనూ క్వాడ్ దేశాలు కలిసి పనిచేశాయి.                             - యొషిహిదే సుగా, జపాన్ ప్రధాని

క్వాడ్ సదస్సు ముగిసిన తర్వాత మోదీ న్యూయార్క్‌కు పయనమయ్యారు. అక్కడ జరగనున్న 76వ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. 

Also Read:Modi Biden Meet: మోదీ-బైడెన్ స్నేహగీతం.. బంధం బలోపేతమే లక్ష్యం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 25 Sep 2021 04:40 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.