PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్‌ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు.. శంకరాచార్యుని విగ్రహం ఆవిష్కరణ

ABP Desam   |  Murali Krishna   |  05 Nov 2021 05:21 PM (IST)

కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది శంకరాచార్యుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ.. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని నేడు సందర్శించారు. ప్రధాని అయిన తర్వాత మోదీ.. కేదార్‌నాథ్‌ రావడం ఇది ఐదోసారి. ప్రధాని కేదార్‌నాథ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేశంలో ఉన్న అన్ని మఠాలు, 12 జ్యోతిర్లింగాలు, శివాలయాలు, శక్తి ధామాలు, మునులు, భక్తులు, పూజ్య శంకరాచార్యుని ఆరాధిస్తున్నవాళ్లు ఎక్కడున్నా మనల్ని నేడు ఆశీర్వదిస్తారు. ఆదిశంకరాచార్యుల రచనలు ఐక్యతను గుర్తుచేస్తాయి. ఉపనిషత్తులో దాగి ఉన్న ఎన్నో విషయాలను స్పష్టంగా చెబుతాయి. 2013 వరదల తర్వాత కేదార్‌నాథ్‌ తిరిగి కోలుకుంటుందా అని అంతా అనుకున్నారు. కానీ మరింత అందంగా, బలంగా ఇది నిలుస్తుందని నా అంతరాత్మ చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. ఇదంతా ఆ శివుడి దయ.                                                -   ప్రధాని నరేంద్ర మోదీ

కేదార్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేదార్‌నాథుడికి ప్రధాని మోదీ తేనె, నెయ్యి, బిల్వపత్రాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం హారతి ఇచ్చారు. 

గోరఖ్‌పుర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ లైవ్‌లో వీక్షించారు. ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణను దేశంలోని 12 జ్యోతిర్లింగాలు, 4 శంకరాచార్య మఠాలతోపాటు ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం రూ. 400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. 

ఆది శంకరాచార్య విగ్రహం..

ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. 12 అడుగుల పొడవు, 35 టన్నుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పునర్నిర్మించిన శంకరాచార్యుని సమాధిని కూడా మోదీ ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్‌ వరదల్లో ఇది దెబ్బతింది.  

ప్రధానికి స్వాగతం..

అంతకుముందు దేహ్రాదూన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ స్వాగతం పలికారు. 
Published at: 05 Nov 2021 12:17 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.