Union Budget 2024 Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024-25 ప్రవేశపెట్టారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సీతారామన్ పద్దుపై ప్రశంసలు కురిపించారు. మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ అని స్పష్టం చేశారు. రైతులు, పేదలను దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ ఈ పద్దుని రూపొందించారని వెల్లడించారు. ఈ పద్దుతో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని,మధ్య తరగతి వర్గం సాధికారత సాధించే విధంగా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు. విద్యారంగంతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టినట్టు స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ని తీసుకురావడం చాలా గొప్ప విషయమని అన్నారు.  


"గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ సారి బడ్జెట్ పూర్తిగా మధ్యతరగతి వర్గానికి మేలు చేసే విధంగా ఉంది. విద్య, నైపుణ్యాభివృద్ధిపై బడ్జెట్‌లో ప్రాధాన్యత దక్కింది. మహిళలు, వ్యాపారులు, MSMEలకూ ఊతం అందించే పద్దు ఇది. యువతకు మేలు చేసే విధంగా ప్రత్యేకంగా ఇన్సెంటివ్ స్కీమ్‌ని తీసుకురావడం చాలా గొప్ప విషయం"


- ప్రధాని నరేంద్ర మోదీ






యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కీమ్‌తో లబ్ధి చేకూరుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకి ఓ నెల జీతం అడ్వాన్స్‌గా ఇస్తారు. అయితే..ఈ డబ్బుని PF లో జమ చేస్తారు. రూ.లక్షలోపు జీతం ఉన్న వాళ్లు ఈ స్కీమ్‌కి అర్హులుగా కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత దేశంలోని బడా సంస్థల్లో పని చేసే విధంగా ఈ స్కీమ్ ప్రోత్సహించనుంది. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరవాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. ఈ పద్దుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే...ఐటీ శ్లాబ్‌ల విషయంలో మాత్రం పెద్దగా ఊరట ఏమీ దక్కలేదు.






Also Read: Union Budget 2024: వ్యవసాయ రంగంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన, భారీగా కేటాయింపులు