NEET Row in Parliament: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కాసపేటికే గందరగోళం నెలకొంది. నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని వెల్లడించారు. రాహుల్ గాంధీ మైక్ స్విచాఫ్ అవడంపైనా వివరణ ఇచ్చారు స్పీకర్. అయితే...ఎంత సేపటికీ నీట్‌పై చర్చకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అంతకు ముందు రాహుల్ గాంధీ నీట్‌ వివాదాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ వేదికగా దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నీట్‌ వ్యవహార ప్రాధాన్యతను అర్థం చేసుకుని సభలో చర్చకు అవకాశమివ్వాలని అన్నారు. కానీ..అందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదు. ఫలితంగా విపక్ష సభ్యులు నిరనస వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. రాహుల్ గాంధీ ఇప్పటికే నీట్‌ని పదేపదే సభలో చర్చకు తెస్తున్నారు. ఒకరోజంతా పూర్తిగా ఈ వివాదంపై చర్చించేందుకే కేటాయించాలని స్పీకర్‌ని కోరారు. 


"నీట్ వివాదంపై ఓ ప్రకటన చేయాలి. అది ఈ పార్లమెంట్ వేదికగానే జరగాలి. నీట్‌ వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదన్న భరోసా విద్యార్థులకు ప్రభుత్వమే ఇవ్వాలి. అందుకే పార్లమెంట్‌లో తప్పనిసరిగా చర్చ జరగాలి. అందుకే ఓ రోజంతా సభలో చర్చించాల్సిన అవసరముందని భావిస్తున్నాం"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ


 






దేశవ్యాప్తంగా నీట్ దుమారం..


నీట్‌ పేపర్ లీక్‌ దేశవ్యాప్తంగా దుమారం (NEET UGC Exam 2024) రేపింది. ఇప్పటికే మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎగ్జామ్‌ని పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఏకంగా ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టింది. నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అయితే...ప్రభుత్వం మాత్రం (NEET Row) విచారణ కొనసాగుతోందని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. నీట్‌ ఎగ్జామ్‌ ఎలా నిర్వహించాలో కోరుతూ తల్లిదండ్రులను పలు సూచనలు,సలహాలు అడిగింది. త్వరలోనే NEET UGC ఎగ్జామ్‌ తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే ఇకపైన NEET ఎగ్జామ్‌ని ఆన్‌లైన్‌లో నిర్వహించాలనే యోచన చేస్తోంది. ఆన్‌లైన్‌లో పరీక్ష పెడితే పేపర్ లీక్‌లకు అవకాశముండదని భావిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పలువురు నిపుణులు కూడా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. 


Also Read: New Criminal Laws: అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, తొలి కేసు నమోదు చేసిన పోలీసులు