Mumbai Threat Message:


కంట్రోల్‌ రూమ్‌కి మెసేజ్‌లు..


26/11 తరహా దాడి చేస్తామని ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్‌లు పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విరార్ ఏరియాలో ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుసున్నట్టు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఈ బెదిరింపు మెసేజ్‌లను సీరియస్‌గా తీసుకున్నారని, అందుకే నిఘా పెంచి వెంటనే నిందితుడుని పట్టుకున్నామని తెలిపారు. ఇటీవలే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో ఓ బోట్ అనుమానాస్పద స్థితిలో కనిపించటం, అందులో AK-47 గన్స్ ఉండటం కలకలం రేపింది. అది జరిగిన వెంటనే...ఈ పోలీసులకు వరుసగా బెదిరింపు మెసేజ్‌లు రావటం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కి ఉగ్రదాడుల బెదిరింపులు వచ్చాయి. కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్‌కు కొన్ని టెక్స్ట్‌ మెసేజ్‌లు వచ్చాయి. "26/11లాంటి దాడి చేస్తాం" అని మెసేజ్‌లు పంపాడు గుర్తు తెలియని వ్యక్తి. ఈ నంబర్‌ను ట్రాక్ చేసిన పోలీసులు...విదేశాల నుంచి ఈ మెసేజ్‌లు వచ్చినట్టు నిర్ధరించారు. "సెంట్రల్ ముంబయిలోని వర్లి ప్రాంతంలో ఉన్న ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్‌లు వచ్చాయి. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఈ మెసేజ్‌లు పంపాడు" అని ఉన్నతాధికారులు వెల్లడించారు. వరుసగా మెసేజ్‌లు వచ్చాయని...అందులో 26/11 అటాక్‌కు సంబంధించిన మెసేజ్‌ కూడా ఉందని తెలిపారు. సిటీ క్రైమ్ బ్రాంచ్ దీనిపై విచారణ జరుపుతోంది.





 


పాకిస్థాన్‌ నంబర్ నుంచి..


ప్రాథమిక విచారణలో తేలిందేంటంటే..పాకిస్థాన్‌కు చెందిన నంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చిందని. ఆరుగురు కలిసి మరోసారి అటాక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు హెచ్చరికలు పంపాడు ఆగంతుకుడు. 2008లో నవంబర్ 26వ తేదీన ముంబయిలోని తాజ్‌హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 166 మంది పౌరులు మృతి చెందారు. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. పది మంది ఉగ్రవాదులు తెగబడ్డారు. దేశంలోనే అతి భయానకమైన ఘటనగా నిలిచిందిది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 26/11 ఉగ్రదాడుల కేసులో పాకిస్థాన్‌లోని యాంటీ టెర్రరిజం కోర్ట్ ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. 2008లో ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఇలా తీర్పు నిచ్చింది. 


బోట్‌లో తుపాకులు 


ఇటీవలో ఓ పడవలో గన్స్ దొరకటంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం...ఈ బోట్ పేరు "Ladyhan"అని నిర్ధరించింది. ఈ బోట్ ఓనర్...ఆస్ట్రేలియాకు చెందిన మహిళ హనా లోర్డోర్గన్ అని వెల్లడించింది. ఆమె భర్త జేమ్స్ హార్బర్ట్ ఈ పడవకు కేప్టెన్‌గా వ్యవహరించారని చెప్పింది. ఈ ఏడాది జూన్ 26న మస్కట్ నుంచి యూరప్‌కు బయల్దేరారని, అయితే మార్గ మధ్యలో ఇంజిన్ ఫెల్ అయిందని తెలిపింది. సాయం కోసం ఎదురు చూస్తుండాగ...ఓ కొరియన్ యుద్ధ నౌక సిబ్బంది వీరికి సహకరించింది. ఆ భార్యాభర్తల్ని ఒమన్‌లో దింపేశారు. వాతావరణం సహకరించకపోవటం వల్ల బోట్‌ని వెనక్కి తీసుకుని వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ పడవే నీళ్లలో కొట్టుకు వచ్చినట్టు భావిస్తున్నారు. 


Also Read: CM Jagan Delhi Tour : సీఎం జగన్ దిల్లీ టూర్, పొత్తులపై క్లారిటీ కోసమేనా?