Mulayam Singh Yadav Health:


లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌తో..


సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ వారం రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. లైఫ్ సేవింగ్ మెడికేషన్ ఇంకా కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. గుడ్‌గావ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ గుప్తా ములాయం ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. "ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి విషమంగానే ఉంది. నిపుణుల పర్యవేక్షణలో  ఐసీయూలో ఆయనకు చికిత్స అందుతోంది" అని వెల్లడించారు.





ఇటీవలే కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మేదాంత హాస్పిటల్ వెల్లి ములాయంను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. ములాయం ప్రాణాలను రక్షించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు మేదాంత ఆసుపత్రి ఓ బులెటిన్‌లో తెలిపింది. అంతకు ముందు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మేదాంత ఆసుపత్రికి వచ్చారు. ములాయం సింగ్ యాదవ్‌ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ "ములాయం ఆరోగ్యం కొంత మెరుగుపడింది.. అయితే 'రిస్క్‌ జోన్‌' నుంచి బయటపడ్డారని చెప్పలేం. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు తెలుస్తాయి" అని అన్నారు. ములాయం సింగ్ యాదవ్ ఆగస్టు 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో అక్టోబర్ 2న ములాయంను ICUకి తరలించారు.


ప్రధాని మోదీ ఆరా..


ములాయం సింగ్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆరా తీశారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని, తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని అఖిలేశ్‌కు ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అఖిలేశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ఆసుపత్రి వైద్యులకు కూడా యోగి ఫోన్ చేశారని, అత్యంత మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు పేర్కొన్నాయి. ములాయం సింగ్.. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో స్వయంగా పార్లమెంటుకు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  నడవలేని స్థితిలో ఉండటంతో వీల్‌ ఛైర్‌లోనే పార్లమెంటుకు వచ్చారు. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో జరిగిన పార్లమెంటు సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగం సమయంలో కూడా ములాయం పార్లమెంటుకు వచ్చారు. ఆ సమయంలో కూడా ములాయం సింగ్ వీల్ ఛైర్‌లోనే వచ్చారు.


Also Read: US Travel Advisory: భారత్‌కి ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసిన అమెరికా, ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచన