Cash Found in ED Raids: ఝార్ఖండ్‌లో ఓ మంత్రి సహాయకుడి ఇంట్లో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు కనిపించాయి. రాజధాని రాంచీలో పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించి ఈ నగదుని జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈ సోదాలు చేపట్టారు ఈడీ అధికారులు. మొత్తంగా రూ.25 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలమ్‌గిర్ ఆలమ్ సహాయకుల ఇళ్లలో పెద్ద ఎత్తున నగదు దాచి పెట్టారన్న అనుమానంతో రెయిడ్స్ చేసింది ఈడీ. గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌కి ఈ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే వీరేంద్ర రామ్‌ని 2023 ఫిబ్రవరిలో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ సోదాల్లో దొరికిన నగదు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్ ఇంట్లో ఈ నోట్ల కట్టలు దొరికాయి. కాంగ్రెస్ నేత అయిన ఆలమ్‌గిర ఆలమ్ (Alamgir Alam) పకూర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.





అయితే...ఈ సోదాలపై బీజేపీ విమర్శలు మొదలు పెట్టింది. ఝార్ఖండ్‌లో అవినీతి ఇంకా అంతమైపోలేదని, ఎన్నికల సమయంలో ఈ స్థాయిలో నగదు దొరకడమేంటని ప్రశ్నిస్తోంది. రాంచీలో ఒకేసారి 9 చోట్ల ఈ సోదాలు చేశారు ఈడీ అధికారులు. ఈ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉన్న ఇంజనీర్‌ ఇళ్లలో రెయిడ్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతుండడంపై ప్రతిపక్ష నేతలు మండి పడుతున్నారు. కావాలనే టార్గెట్ చేసి బీజేపీ సోదాలు చేయిస్తోందని విమర్శిస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు. 


"ఝార్ఖండ్‌లో అవినీతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేసేందుకే ఈ డబ్బులన్నీ ఇలా దాచి పెట్టుంటారు. ఎన్నికల సంఘం కచ్చితంగా వీళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి"


- ప్రతుల్ సహదేవ్, ఝార్ఖండ్ బీజేపీ ప్రతినిధి


 






Also Read: LS Elections 2024: ఎన్నికలకు ఏనుగుల ఆటంకం, తరమలేక తల పట్టుకుంటున్న అధికారులు