Layoffs in Microsoft: మైక్రోసాఫ్ట్‌ మరో రౌండ్ లేఆఫ్‌లు మొదలు పెట్టింది. ఈ సారి వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనుంది. కనీసం పది వేల మందిని తొలగిస్తామని గతేడాది ప్రకటించింది. అప్పటి నుంచి విడతల వారీగా లేఆఫ్‌లు చేపడుతోంది. ఇప్పుడు మరోసారి వెయ్యి మందిని ఇంటికి పంపే పనిలో ఉంది. Strategic Missions, Technologies org విభాగాల్లోని ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌ని అమ్మేయాలని చూస్తోంది మైక్రోసాఫ్ట్. దీంతో పాటు సర్వర్‌లను రెంట్‌కి ఇచ్చేందుకూ సిద్ధమవుతోంది. మరి కొన్ని విభాగాల్లోనూ ఈ లేఆఫ్‌లు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. CNBC వెల్లడించిన వివరాల ప్రకారం..తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. వ్యూహాలు మార్చడంలో భాగంగా లేఆఫ్‌లు చేపట్టాల్సి వస్తోందని తెలిపింది. 


"మైక్రోసాఫ్ట్‌లోని మిక్స్‌డ్ రియాల్టీ ఆర్గనైజేషన్‌లో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తోంది. డిఫెన్స్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌లను మాత్రం కొనసాగిస్తాం. వాటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ లేఆఫ్‌లు చేయాల్సి వస్తోంది. ఇకపై కంపెనీ వ్యూహాలు, విధానాలు మారిపోతాయి"


- మైక్రోసాఫ్ట్ 


Mixed Reality Unit లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ భావించింది. కానీ...ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది సాధ్య పడడం లేదని వెల్లడించింది. అందుకే కాస్త వెనక్కి తగ్గింది. గతేడాది డిసెంబర్‌లోనూ మిక్స్‌డ్ రియాల్టీ యూనిట్‌పై అసహనం వ్యక్తం చేసింది. పెట్టుబడులు తగ్గించుకున్నట్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఉద్యోగులనూ తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీలో కనీసం 5% మేర వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే...అత్యంత కీలకమైన విభాగాల్లో రిక్రూట్‌మెంట్‌ కొనసాగుతుందని సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. 2022 నుంచి ప్రపంచవ్యాప్తంగా బడా సంస్థలు లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కాస్త ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ సంస్థలు వేలాది మందిని తొలగిస్తున్నాయి.