LPG Dealers Clarity on 500 Rupees Gas Cylinder Distribution in Telangana: తెలంగాణలో (Telangana) రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పంపిణీపై ఎల్పీజీ డీలర్స్ (LPG Dealers Group) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టత ఇచ్చారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు రూపొందించలేదని గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ తెలిపారు. కేవైసీ చేసిన వినియోగదారులకే మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్ వస్తుందనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్రం సూచనల మేరకు నవంబర్ నుంచే రాష్ట్రంలో కేవైసీ పరిశీలన జరుగుతోందని, ఈ క్రమంలో రూ.500కే సిలిండర్ హామీ ఇవ్వడంతో వినియోగదారుల్లో కేవైసీపై ఆందోళన నెలకొందని చెప్పారు.


ఇంటి వద్దే ఈ కేవైసీ


గ్యాస్ సిలిండర్ ఈ కేవైసీకి సంబంధించి ఆఫీసులకు గుంపులుగా వచ్చి ఇబ్బందులు పడొద్దని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఓ ప్రకటన విడుదల చేశారు. డెలివరీ బాయ్స్ వద్దే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గ్యాస్ ఈ కేవైసీకి సంబంధించి కేంద్రం ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని, వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసీ పూర్తి చేయాలని తమకు ఆదేశాలు అందినట్లు చెప్పారు. డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చెయ్యొచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ బాయ్స్ వద్ద ఎవరిదైనా పూర్తి కాకపోతే, అలాంటి వారు మాత్రమే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని తెలిపారు.


సుమారు కోటి కనెక్షన్లు


తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా హెచ్‌పీసీఎల్‌ నుంచి 43.40 లక్షలు, ఐఓసీఎల్‌ నుంచి 47.97 లక్షలు, బీపీసీఎల్‌ నుంచి 29.04 లక్షల వినియోగదారులు ఉన్నారు. వీరిలో 44 శాతం మంది అంటే 52.80 లక్షల మంది ప్రతి నెలా సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. 89.99 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఉండగా, తొలి ప్రతిపాదన ప్రకారం వీరికి పథకాన్ని వర్తింపచెయ్యొచ్చు. అయితే, వీరిలో అనర్హులు కూడా లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండో ప్రతిపాదన మేరకు లబ్ధి దారుల ఎంపికకు సమయం ఎక్కువ పడుతుంది. ఈ మేరకు నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులు అందజేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955 కాగా, సాధారణ కనెక్షన్లు ఒక్కో బుకింగ్ కు కేంద్రం రూ.40 రాయితీ అందిస్తోంది. ఉజ్వల్ కనెక్షన్లకు రూ.340 రాయితీ లభిస్తోంది. తెలంగాణలో మొత్తం 11.58 లక్షల ఉజ్వల్ కనెక్షన్లుండగా, కేంద్రం విజ్ఞప్తి మేరకు 'గివ్ ఇట్ అప్'లో భాగంగా రాష్ట్రంలో 4.2 లక్షల మంది రాయితీ వదులుకున్నారు. ఈ పథకం కింద ఏడాదికి ప్రతి లబ్ధిదారునికి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తే ప్రభుత్వంపై దాదాపు రూ.2,225 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. అదే 12 సిలిండర్లు ఇస్తే ఆ భారం డబుల్ అవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.


ప్రభుత్వం ముందు 2 ప్రతిపాదనలు


'మహాలక్ష్మి' పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని తాజాగా పౌర సరఫరాల శాఖకు ఆదేశాలందగా, పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ఆ శాఖ 2 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. రేషన్ కార్డు ఉన్న వారితో పాటు లేని వారిలోనూ లబ్ధిదారులను ఎంపిక చేయడం ఒకటి, రేషన్ కార్డులతో సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఇంకొకటిగా ప్రతిపాదించింది. మరి, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Also Read: Telangana News: విద్యుత్ రచ్చ - అక్బరుద్దీన్ ఒవైసీకి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్, అసెంబ్లీలో ఇరువురి మధ్య మాటల యుద్ధం