Kim Jong-un: ఇక ఆటోమెటిక్‌గా అణుదాడి- తగ్గేదేలే, కిమ్‌ కొత్త చట్టం!

ABP Desam   |  Murali Krishna   |  09 Sep 2022 02:16 PM (IST)

Kim Jong-un: అణ్వాయుధాలను ఆటోమెటిక్‌గా వాడుకునే అవ‌కాశాన్ని మిలిట‌రీకి క‌ల్పిస్తూ ఉత్తర కొరియా కొత్త చట్టం రూపొందించింది.

(Image Source: Getty)

Kim Jong-un: ప్రపంచంపై రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కొత్త బాంబు పేల్చారు. అణ్వాయుధాల వినియోగంపై ఓ కొత్త చట్టం తీసుకువచ్చారు.

ఇదే చట్టం

త‌న‌ను తాను ర‌క్షించుకునే సమయంలో ముంద‌స్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ చ‌ట్టాన్ని త‌యారు చేసింది. అణ్వాయుధీక‌ర‌ణ అంశంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

అణ్వాయుధాల వినియోగంపై వెనక్కి తగ్గేదే లేదు. మా దేశాన్ని రక్షించుకునే విషయంలో అవసరమైతే ముందుగా మేమే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.                               - కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత

దేశానికి న్యూక్లియ‌ర్ స్టేట‌స్ ఇస్తూ నార్త్ కొరియా పార్ల‌మెంట్ గురువారం కొత్త చ‌ట్టాన్ని రూపొందించింది. అటామిక్ ఆయుధాల‌ను ఆటోమెటిక్‌గా వాడుకునే అవ‌కాశాన్ని మిలిట‌రీకి క‌ల్పిస్తున్న‌ట్లు కొత్త చ‌ట్టంలో పేర్కొన్నారు.

గతంలో

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అణు హెచ్చరికలు చేయడం కొత్తేం కాదు. అణు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ గతంలోనే ప్రకటించారు. అమెరికాకు పరోక్ష హెచ్చరికలు చేశారు. కొరియా యుద్ధ వార్షికోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొవడానికి మన బలగాలు సిద్ధంగా ఉన్నాయి. అణు ముప్పును ఎదుర్కోవడానికి కూడా పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. యుద్ధం ముగిసి 70 సంవత్సరాలు పూర్తవుతోన్న కూడా దక్షిణ కొరియాతో కలిసి యూఎస్‌ ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన చర్యలకు దిగుతోంది. మన భద్రతకు ముప్పు కలిగేలా అమెరికా సైనిక విన్యాసాలు చేపడుతోంది. ఈ వైఖరి ఇరు దేశాల సంబంధాలను తిరిగి కోలుకోలేని దశకు దిగజార్చుతాయి. యూఎస్‌, దక్షిణ కొరియా నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాం.                                                     "
-కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత

ఢీ అంటే ఢీ

అమెరికాతో సైనిక చ‌ర్య‌కు పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్న‌ట్లు కిమ్ వెల్ల‌డించారు. అవ‌స‌రం అయితే అణ్వాయుధాల‌ను రంగంలోకి దింపుతామ‌ని హెచ్చ‌రించారు. ఉత్త‌ర కొరియా ఏడ‌వ సారి అణ్వాయుధాన్ని ప‌రీక్షించ‌నున్న‌ట్లు వార్త‌ల వ‌స్తున్న వేళ కిమ్ ఈ వార్నింగ్ ఇచ్చారు. 2017లో చివ‌రిసారి ఉత్త‌ర కొరియా న్యూక్లియ‌ర్ టెస్ట్ నిర్వ‌హించింది. 

ఈ ఏడాది ఉత్త‌ర కొరియా ఇప్ప‌టికే అత్య‌ధిక స్థాయిలో మిస్సైళ్ల‌ను ప‌రీక్షించింది. ఆ దేశంలో ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు 31 మిస్సైళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు అమెరికా ప్ర‌తినిధి తెలిపారు. 

Also Read: SC On Hijab: నమాజ్ తప్పనిసరి కానప్పుడు, హిజాబ్ ఎలా?: సుప్రీం సూటి ప్రశ్న

Also Read: King Charles III: క్వీన్ ఎలిజబెత్ 2 వారసుడు ఎవరో తెలుసా?

Published at: 09 Sep 2022 02:10 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.