King Charles III: క్వీన్ ఎలిజబెత్ 2 వారసుడు ఎవరో తెలుసా?

ABP Desam   |  Murali Krishna   |  09 Sep 2022 12:29 PM (IST)

King Charles III: క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో ఆమె వారసుడు ఎవరు? అనే ప్రశ్న మొదలైంది.

క్వీన్ ఎలిజబెత్ 2 వారసుడు ఎవరో తెలుసా?

King Charles III: రాణి ఎలిజబెత్ 2 మరణంతో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. మరి ఇప్పుడు క్వీన్ మరణించడంతో ఆమె వారసుడు లేదా వారసురాలిగా ఎవరు ఉంటారు? అనే ప్రశ్న తలెత్తింది. మరి ఆమె వారసుడు ఎవరో చూద్దాం.

ప్రిన్స్ చార్లెస్

బ్రిటన్‌ రాజకుటుంబ నిబంధనల ప్రకారం రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు లేదా వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్‌ రాజు/రాణిగా మారిపోతారు. కనుక రాణి ఎలిజబెత్‌ 2 వారసుడిగా మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా మారతారు. అయితే పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రమాణ స్వీకారం

రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును ప్రకటిస్తారు. యాక్సెషన్‌ కౌన్సిల్‌ లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌ నుంచి ఈ అధికారిక ప్రకటన వస్తుంది. పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్‌ చార్లెస్‌ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయాలి.

రాణి మృతి

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 (96) గురువారం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యానికి గురై రాణి ఎలిజబెత్ 2 కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ విషయాన్ని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, సహా యావత్ ఇంగ్లాండ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లోనే ఆమె ఉంటున్నారు. చివరికి అనారోగ్యంతోనే కన్నుమూశారు. 

అత్యధికకాలం

బ్రిటన్‌కు ఎలిజబెత్ 2 ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. ఆమె మృతి పట్ల పలువురు దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ రాణి పోరాట యోధురాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో ఆమెకు నివాళులర్పిస్తున్నట్లు ట్విటర్‌లో తెలిపారు. 2015-18లో బ్రిటన్‌ రాణితో జరిగిన సమావేశాలను మోదీ గుర్తు చేసుకున్నారు.

నా పట్ల ఆమె చూపిన ప్రేమ, కరుణను ఎప్పటికీ మర్చిపోను. తన వివాహ సమయంలో మహాత్మాగాంధీ బహుమతిగా ఇచ్చిన చేతి రుమాలును బ్రిటన్‌ రాణి చూపించారు. రాణి కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నా.                      -    ప్రధాని నరేంద్ర మోదీ

Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 6,093 కరోనా కేసులు నమోదు

Also Read: Queen Elizabeth Death: క్వీన్ ఎలిజబెత్ 2 గురించి ఈ 10 షాకింగ్ విషయాలు తెలుసా?

Published at: 09 Sep 2022 12:06 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.