Kejriwal House Renovation:


ఇంటి రెనోవేషన్ 


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ "ఇంటి" చుట్టూ రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆప్ వర్సెస్ బీజేపీ వార్ గట్టిగానే జరుగుతోంది. ఇప్పుడు కేజ్రీవాల్ ఇంటి గురించి ఆ వాదం ఇంకాస్త ముదిరింది. ఇల్లు బాగు చేసుకునేందుకు కేజ్రీవాల్ రూ.45 కోట్లు ఖర్చు చేశారంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. కేజ్రీవాల్‌కి ఇన్ని విలాసాలెందుకు..? అని ప్రశ్నిస్తోంది. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఆ డబ్బుతోనే విలాసవంతమైన ఇళ్లు కట్టుకుంటున్నారని మండి పడుతోంది. దీనిపై ఆప్ కూడా గట్టిగానే బదులిస్తోంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ నివసిస్తున్న ఇల్లు 80 ఏళ్ల క్రితం కట్టారని చెప్పారు. పైకప్పు పూర్తిగా పాడైపోయినందునే రెనోవేషన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. 


"ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ నివసిస్తున్న ఇల్లు 80 ఏళ్ల క్రితం కట్టింది. సీఎం తల్లిదండ్రులు ఉంటున్న రూమ్ పై కప్పు కూలిపోయింది. సీఎం ఉండే రూమ్‌లోనూ పైకప్పు పెచ్చులూడుతోంది. అధికారులతో భేటీ అయ్యే రూమ్‌లోనూ ఇదే పరిస్థితి. అందుకే PWD విభాగం ఇంటిని రెనోవేట్ చేసుకోవాలి సూచించింది. ఆ సూచనల ప్రకారమే బంగ్లాలో మార్పులు చేస్తున్నారు"


- సంజయ్ సింగ్, ఆప్ ఎంపీ






ఖర్చైంది ఇంత..


బీజేపీ మాత్రం కేజ్రీవాల్ ఇంటి కోసం రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తోంది. అయితే..ప్రస్తుతం అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఇంటీరియర్ డెకరేషన్ కోసం రూ. 11.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక స్టోన్, మార్బుల్ ఫ్లోరింగ్ కోసం రూ.6 కోట్లు, ఇంటీరియర్ కన్సల్టెన్సీకి రూ.కోటి ఖర్చు చేయనున్నారు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌ల కోసం రూ.2.58కోట్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కోసం రూ.2.85 కోట్లు, వార్డ్‌రోబ్‌కి రూ.1.41 కోట్లు, కిచెన్ అప్లియనెస్స్ కి రూ.1.1కోట్లు ఖర్చు చేస్తున్నారని వెల్లడించారు అధికారులు. 2020 సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 2022 జూన్‌ మధ్య కాలంలో ఈ ఖర్చులు చేసినట్టు స్పష్టం చేశారు. అయితే...బీజేపీ మాత్రం విమర్శలు ఆపడం లేదు. దీనిపై ఆప్ నేతలు ఓ సవాల్ విసిరారు. బీజీపీ వాళ్లే నేరుగా ఇంటికి వచ్చి చెక్ చేసుకోవాలని, నిజంగా అందుకు రూ.45 కోట్లు ఖర్చైందో లేదో డిబేట్ పెట్టాలని ఛాలెంజ్ చేశారు.