కర్ణాటకలో హిజాబ్‌ వివాదం కారణంగా మూసివేసిన పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. దీంతో ఫిబ్రవరి 14-19 వరకు ఉడుపిలోని అన్ని ఉన్నత పాఠశాలల వద్ద సెక్షన్​ 144 విధించింది ఆ జిల్లా యంత్రాంగం. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.


పరిస్థితి చూసి


హిజాబ్ వివాదంతో అట్టుడుకిన కర్ణాటకలో మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ప్రీ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలను తెరవడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.


హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోని పాఠశాలలకు ఫిబ్రవరి 9న మూడు రోజుల సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14 నుంచి పదో తరగతి వరకు పాఠశాలలను తెరవాలని నిర్ణయించింది.


మధ్యంతర ఉత్తర్వులు


హిజాబ్‌ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించిన కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. విద్యాసంస్థల్లోకి అడుగుపెట్టినప్పుడు విద్యార్థులు ఎలాంటి మతపరమైన దుస్తులను ధరించరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హిజాబ్ లేదా కాషాయ కండువా ఇలా.. ఏదీ ధరించవద్దని పేర్కొంది. కోర్టులో ఈ వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్నంతవరకు ఇది పాటించాలని ఆదేశించింది.



కళాశాలల పునఃప్రారంభంపై ధర్మాసనం ఆదేశాలు ఇస్తుంది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నంతవరకు విద్యార్థులు ఎవరూ హిజాబ్ లేదా కాషాయ కండువా వంటి మతపరమైన దుస్తులను ధరించి కళాశాలలకు వెళ్లొద్దు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగిస్తాం.                                             "
-   కర్ణాటక హైకోర్టు

 

హిజాబ్ వివాదం

 


కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్‌ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. నెల రోజుల నుంచి ఉడుపి, చిక్‌మంగళూరులో వాతావరణం ఆందోళనగా ఉంది. హిజాబ్స్‌ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోవడంతో ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు.


మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్‌' నినాదాలతో ర్యాలీలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.