Karnataka Govt Hikes Petrol Price: వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌ ధరలు అమాంతం పెచింది. ట్యాక్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 మేర ధర పెరిగింది. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. Karnataka Sales Tax (KST)ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకూ పెట్రోల్‌పై ఈ ట్యాక్స్ 25.92% ఉండగా దాన్ని 29.84%కి పెంచింది. ఇక డీజిల్‌పై 14.3% ఉన్న పన్నుని 18.4%కి పెంచింది. ఈ పెరిగిన ధరల ఆధారంగా చూస్తే బెంగళూరులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.102.86 పైసలు కాగా డీజిల్‌ లీటర్ ధర రూ.88.94కి చేరుకుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. కర్ణాటక ఫెడరేషన్‌ ఆఫ్ పెట్రోలియం ఇప్పటికే ఈ ధరల్ని అమల్లోకి తెచ్చింది. అన్ని బంక్‌లలోనూ డిజిటల్ డిస్‌ప్లేలపై ధరలు మార్చింది. 






చివరిసారి 2021 నవంబర్‌లో కర్ణాటకలో బీజేపీ హయాంలో పెట్రోల్ ధరని రూ.13.30, డీజిల్ ధరని రూ.19.40 మేర తగ్గించింది ప్రభుత్వం. కొవిడ్‌ సంక్షోభం నుంచి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెస్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిశాయో లేదో అప్పుడే ఇలా వడ్డన మొదలైంది. 5 హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రూ.50-60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. అందుకే పెట్రో ధరలను పెంచిందన్న వాదన వినిపిస్తోంది. ఈ పెంపుతో ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.2,500-2,800 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అంతే కాదు. భారత్‌లో తయారైన లిక్కర్‌పై 20% అదనపు పన్ను విధించింది. కొత్తగా రిజిస్టర్ అయిన వాహనాలపై 3% అదనపు సెస్‌ విధించడంతో పాటు రూ.25 లక్షలకు మించిన విద్యుత్ వాహనాలపైన లైఫ్‌టైమ్ ట్యాక్స్‌ ప్రవేశపెట్టింది. 


ఆదాయం పెంచుకునేందుకు ఇలా రకరకాల మార్గాల్లో ప్రజలపై భారం పెంచుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల మంది లబ్ధిదారులున్నారని అంచనా. వీళ్ల కోసం కనీసం రూ.36 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. సిద్దరామయ్య ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.52 వేల కోట్లు కేటాయించారు. అయినా ఈ కేటాయింపులు సరిపోతాయన్న గ్యారెంటీ లేదని కొందరు చెబుతున్నారు. అందుకే పెట్రోల్‌ డీజిల్ ధరలు పెంచింది ప్రభుత్వం. 


Also Read: Suresh Gopi: ఇందిరా గాంధీపై సురేశ్ గోపీ కీలక వ్యాఖ్యలు, మదర్ ఆఫ్ ఇండియా అంటూ ప్రశంసలు