Karnataka CM Race: 


సిద్దరామయ్యకే మొగ్గు..


కర్ణాటక సీఎం రేసు దాదాపు ముగింపు దశకు వచ్చినట్టే కనిపిస్తోంది. సిద్దరామయ్యకే హైకమాండ్ మొగ్గు చూపుతోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే..హైకమాండ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం వల్ల ఇంకా సస్పెన్స్ వీడడం లేదు. శంఖువులో పోస్తేనే తీర్థం అన్నట్టు...అఫీషియల్‌గా స్టేట్‌మెంట్ వస్తే తప్ప ఫలానా వ్యక్తే సీఎం అని తేల్చడానికి వీల్లేదు. కానీ...ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం చూస్తే మాత్రం సిద్దరామయ్య పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. మరి డీకే శివకుమార్ సంగతేంటి..? సీఎం కుర్చీపై అంత ఆశలు పెట్టుకున్న ఆయనను హైకమాండ్ ఎందుకు పక్కన పెట్టింది..? సిద్దరామయ్యకు ఉన్న అర్హతలేంటి..? శివకుమార్‌కు లేని క్వాలిఫికేషన్ ఏంటి..? ప్రస్తుతం ఈ ప్రశ్నలే తెరపైకి వస్తున్నాయి. కర్ణాటక పాలిటిక్స్‌ని మొదటి నుంచి గమనిస్తున్న వాళ్లంరూ ఈ టాపిక్‌పైనే చర్చించుకుంటున్నారు. 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది నేనే అని అంత కాన్ఫిడెంట్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చిన శివకుమార్‌ను పక్కన పెడితే...కాంగ్రెస్‌కు నష్టం తప్పదేమో అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. ఇప్పటికే ఇంటి పోరుతో నలిగిపోతున్న ఆ పార్టీకి ఇది పెద్ద సవాలుగా మారింది. ఏదేమైనా...శివకుమార్‌కి సీఎం పదవి కట్టబెట్టకపోవడానికి కొన్ని ప్రధాన కారణాలున్నట్టు తెలుస్తోంది. 


సీబీఐ, ఈడీ కేసులు..


కర్ణాటక పాలిటిక్స్‌లో ధనవంతుల లిస్ట్‌ తీస్తే..అందులో ముందుగా కనిపించే పేరు డీకే శివకుమార్. ఆస్తులే కాదు...అదే స్థాయిలో అవినీతి కేసులూ ఆయన పేరిట ఉన్నాయి. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై దాదాపు రెండు నెలల పాటు జైల్లో ఉన్నారు. సీబీఐ విచారణను సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ని కూడా హైకోర్టు కొట్టేసింది. పదేపదే ఈడీ విచారణకు హాజరవుతున్నారు డీకే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని...అధిష్ఠానం శివకుమార్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులను పట్టించుకోకుండా సీఎం పదవి ఇచ్చినా...దర్యాప్తు సంస్థలు ఆయనను పదేపదే విచారణకు పిలవడం కాస్త ఇబ్బంది కలిగించడం ఖాయం. ముఖ్యమంత్రే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే..ఇక ప్రభుత్వంపై ప్రజలకు ఏం నమ్మకముంటుంది..? ఇదిగో ఇదే పాయింట్‌తో హైకమాండ్‌ సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు. 


మాస్ ఇమేజ్ లేదు..


ఇక రెండో కారణం..ఏంటంటే సిద్దరామయ్యకు ఉన్నంత మాస్‌ బేస్‌ శివకుమార్‌కి లేదు. సీఎం స్థాయి వ్యక్తి అంటే అందరికీ చేరువయ్యే వ్యక్తి అయ్యుండాలి. అయితే...డీకే వక్కళిగ వర్గానికి మాత్రమే దగ్గరయ్యారు. ఈ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ఓల్డ్ మైసూర్‌లో తప్ప పెద్దగా ఫ్యాన్ బేస్ లేదు. అందులోనూ...మిగతా వర్గాలు ఆయనను పెద్దగా సపోర్ట్ చేయడం లేదు. అటు సిద్దరామయ్యకు మాత్రం అన్ని వర్గాల మద్దతు ఉంది. ముఖ్యంగా దళితులతో పాటు మిగతా వెనకబడిన వర్గాల అండ ఉంది. 


ఎమ్మెల్యేల మద్దతు..


సీఎం పదవికి పోటీ పడాలంటే ఎమ్మెల్యేల బలం గట్టిగా ఉండాలి. ఈ విషయంలో సిద్దరామయ్య కన్నా వెనకబడి ఉన్నారు డీకే. ఆయనకు కేవలం 40 మంది మాత్రమే సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఎక్కువ ఉంటే...వాళ్లకే సీఎం పదవి ఇస్తామని ఇప్పటికే రాహుల్ చాలా క్లారిటీగా చెప్పారు. ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలో సిద్దరామయ్య సిద్ధహస్తుడు. 2013లో ఈ వ్యూహంతోనే ఖర్గేను ఓడించారు. ఈ సారి కూడా అదే స్ట్రాటెజీ అమలు చేసి 90 మంది బలాన్ని కూడగట్టుకున్నారు. 


సీనియార్టీ..


సిద్దరామయ్యతో పోల్చి చూస్తే డీకే శివకుమార్‌ సీనియార్టీ తక్కువే. 2004లో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే సిద్దరామయ్య డిప్యుటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరవాత క్రమంగా మంచి నేతగా ఎదిగారు. రెండుసార్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ రకంగా చూస్తే...సిద్దరామయ్య అనుభవం కూడా ఆయనకు కలిసొచ్చింది. ఇదే డీకేకి మైనస్ అయింది. 


Also Read: Karnataka CM Race: రాహుల్‌తో సిద్దరామయ్య, డీకే శివకుమార్ వరుస భేటీలు - సోనియా గాంధీ ఇంట్లో మంతనాలు