Kadapa News: కొరియర్ సర్వీస్ మాటున ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసుల విస్తృత దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ తో పాటు మరో ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 40 ఎర్ర చందనం దుంగలు, గూడ్స్ వాహనం, స్కార్పియో, 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.


అసలేం జరిగిందంటే..?


జమ్మలమడుగు కొండాపురం మండలం తాడిపత్రి ముద్దనూరు బైపాస్ రోడ్డులో డంప్ చేసిన ఎర్రచందనం దుంగల లోడను పలువురు వాహనంలోకి ఎక్కిస్తున్నారు. అదే సమయంలో పోలీసులు అక్కడకు వెల్లగా.. స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారందరినీ అరెస్ట్ చేశారు. ఇందులో కరుడు కట్టిన అంతర్రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్ మండాది భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ మండాది భాస్కర్ రెడ్డి స్వగ్రామం ప్రొద్దుటూరు. ఇన్నాళ్లకు అతడు పోలీసులకు చిక్కాడు. అయితే ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. స్మగర్ల అరెస్టులో కీలక పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తుషార్ డూడీ , ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ చెంచు బాబు, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ నాగభూషణం, కొండాపురం సీఐ సుదర్శన్ ప్రసాద్, ఎస్సై సత్యనారాయణ, టాస్క్ ఫోర్స్ ఆర్.ఎస్సై వెంకటేశ్వర్లు మిగతా సిబ్బందిని జిల్లా ఎస్పి అన్బు రాజన్ అభినందించారు. 


గత నెలలో తిరుపతిలో.. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ బ్రదర్స్ అరెస్ట్


శేషాచలం అటవీ ప్రాంతానికే సొంతమైన అరుదైన సంపద ఎర్రచందనం. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం చెట్లను నరికి విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు కొందరు స్మగ్లర్స్. అయితే ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు పక్కా వ్యూహంతో ఫోలీసు యూనిఫాంతో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ బ్రదర్స్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుండి పోలీసు యూనిఫాం, సెల్‌ఫోన్స్, కారు, ఎర్రచందనం దుంగలలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి వెల్లడించిన‌ వివరాల ప్రకారం.. పోలీసు యూనిఫాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్  స్మగ్లర్ బ్రదర్స్ తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎట్టకేలకు పట్టుకున్నాం. వివిధ జిల్లాల్లో దాదాపు 89 కేసులు ఉన్న ఈ స్మగ్లింగ్ సోదరులను కటకటాల వెనక్కు పంపారు. వారి నుంచి  31ఎర్రచందనం దుంగలు, ఆరు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన షేక్ చెంపతిలాల్ బాషా (36), షేక్ చంపతి జాకీయర్ (27)లు  గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిపారు. చాలా కాలం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా చేపట్టిన వ్యూహం ప్రకారం అరెస్టు చేసినట్లు తెలిపారు.