Joshimath Restoring Impossible: 


అదే కారణం..


జోషిమఠ్‌లో పరిస్థితులు రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందో చెప్పడం కష్టంగా మారింది. కొందరు నిపుణులు ఇప్పటికే ఇందుకు గల కారణాలేంటో అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే IIT కాన్పూర్‌కి చెందిన ఓ ప్రొఫెసర్ సంచలన విషయం చెప్పారు. జియాలజిస్ట్ అయిన ఆయన జోషిమఠ్‌ పరిస్థితులపై సర్వే చేసి ఆ రిపోర్ట్‌ని ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగానే ఆయన ఆందోళనకర నిజాలు వెల్లడించారు. జోషిమఠ్‌ను మళ్లీ మునుపటి స్థితికి తీసుకురావడం అసాధ్యమని తేల్చి చెప్పారు. ఇలా ప్రయత్నించడమూ ప్రమాదకరమేనని అని స్పష్టం చేశారు. స్లైడింగ్ జోన్‌లో ఉన్న ఈ ప్రాంతాన్ని రీసెటిల్ చేయడం కష్టమేనని తెలిపారు. ఇందుకు కారణమేంటో కూడా చెప్పారు ఆ జియాలజిస్ట్. "ఎన్నో దశాబ్దాలుగా జోషిమఠ్ ప్రాంతం స్లైడింగ్ జోన్‌లో ఉంది. ఈ కారణంగానే ఇక్కడి రాళ్లు, గోడలు చాలా బలహీనంగా మారిపోయాయి. అందుకే ఇలా ఇళ్లు కూలిపోతున్నాయి" అని వెల్లడించారు. దాదాపు 700 ఇళ్లకు పగుళ్లను గుర్తించిన అధికారులు వాటిని కూల్చే పనిలో ఉన్నారు. ఇది ఇలా జరుగుతుండగానే...మరి కొన్ని ఇళ్లకు బీటలు వారాయి. మౌంట్ వ్యూ, మలారి ఇన్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్‌నీ కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. వీటిని అలాగే వదిలేస్తే పక్కన ఉన్న  బిల్డింగ్‌లకూ ప్రమాదం జరుగుతుందని భావిస్తున్నారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 13న ఈ ప్రత్యేక భేటీ జరగనుంది. బాధితులకు పరిహారం అందించే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇతరత్రా ఏర్పాట్లపైనా చర్చించనున్నారు. 


కూలిపోయే దశలో ఇళ్లు..


దాదాపు 700 ఇళ్లకు ఇప్పటికే పగుళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. మరో 86 ఇళ్లు ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. మరో 100 కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించారు. కూలిపోయే దశలో ఉన్న ఇళ్లు, హోటళ్లను కూల్చేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఇప్పటికే గాంధీనగర్, పలికా మార్వారీ ప్రాంతాల్లోని ఇళ్లు పూర్తిగా కూలిపోయే దశలో ఉన్నాయి. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే... గాంధీనగర్‌లో 135 ఇళ్లపై పగుళ్లు కనిపించాయి. పలికా మార్వారీలో 35 ఇళ్లు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. లోవర్ బజార్‌లో 34,సింగ్‌ధర్‌లో 88,మనోహర్‌ భాగ్‌లో 112 ఇళ్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వీటితోపాటు ఆ ప్రాంతంలో ఇలాంటి స్థితిలో ఉన్న ఇళ్లన్నింటినీ కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే...ఇక్కడే మరో చిక్కొచ్చి పడింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవేళ ఆ అంచనాలకు అనుగుణంగానే వర్షాలు కురిస్తే...జోషిమఠ్‌లో ఇప్పుడున్న దాని కన్నా ఆందోళనకర పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. అధికారులు ఎలాంటి వ్యూహంతో ఇళ్లు కూల్చి వేస్తారన్నదీ తేలాల్సి ఉంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామనైతే ప్రభుత్వం ప్రకటించింది. కచ్చితంగా పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చింది. అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.


Also Read: Golden Globes 2023: ‘RRR’ టీమ్‌కు చిరంజీవి, రెహమాన్ అభినందనలు