Jacqueline Fernandez Bail: సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.






జాక్వెలిన్.. లాయర్ అభ్యర్థన మేరకు రూ.50,000 పూచికత్తుపై మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై ఈడీ ప్రతిస్పందన కోరారు అదనపు సెషన్స్ జడ్జి శైలేందర్ మాలిక్. అనంతరం జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 22కు కోర్టు వాయిదా వేసింది.


రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొంటూ రెండో అనుబంధ ఛార్జిషీట్‌ను ఆగస్టు 17న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది.


దర్యాప్తులో


ఈడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి జాక్వెలిన్ లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించింది ఈడీ. సుఖేశ్ చంద్రశేఖర్ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని అయినప్పటికీ అతనితో స్నేహంగా ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. 


సుకేశ్ చంద్రశేఖర్‌తో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అతని నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది. దాదాపు రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైనా సుకేశ్‌ గురించి ముందే తెలిసినా.. అతడి నుంచి విలువైన బహుమతులు తీసుకోవడంలో ఆమె ఎలాంటి సంకోచం వ్యక్తం చేయలేదని ఈడీ అధికారులు తెలిపారు.


ఎంతో విలువైన డిజైనర్ బ్యాగులు, వజ్రాలు, బ్రాస్‌లెట్లు, జిమ్ సూట్లు, మినీ కూపర్ ఇలా చాలా విలువైన వస్తువులు తను తీసుకుందని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన బహుమతులను జాక్వెలిన్‌కు సుకేశ్ ఇచ్చాడని అధికారులు వివరించారు. సుకేశ్ గురించి వార్తలు వచ్చిన సందర్భంలోనే... అతను ఈ శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో జాక్వెలిన్ సుకేశ్‌తో చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపించింది. 


లుక్ అవుట్


ఈ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే జాక్వెలిన్‌ను పలుమార్లు అధికారులు పిలిచి విచారించారు. ఆ సమయంలోనే జాక్వెలిన్ విదేశాలకు పోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది ఈడీ. ఈ లుక్ అవుట్ నోటీసులపై జాక్వెలిన్ కోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం.. జాక్వెలిన్ విదేశాలకు వెళ్ల వచ్చని అనుమతి మంజూరు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు జాక్వెలిన్ ఆస్తులను సైతం అటాచ్ చేశారు. ఆమెకు చెందిన రూ.7.27 కోట్లను అటాచ్ చేశారు అధికారులు. అయితే ఇందులో రూ.7 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లే ఉన్నాయి. 


అదితి సింగ్


రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి వారి భార్య దగ్గరి నుంచి ఏకంగా రూ. 200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. డబ్బులు తీసుకున్న సుకేశ్.. వారికి బెయిల్ ఇప్పించలేదు. ఇదేంటని వాళ్లు అడిగితే దాటవేస్తూ వచ్చాడు. అలా శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు సుకేశ్‌పై ఫిర్యాదు చేసింది. తమ నుంచి రూ.200 కోట్లు తీసుకున్నట్లు చెప్పింది. 2021లో నమోదైన ఈ కేసులో పోలీసులు సుకేశ్‌ను అరెస్టు చేశారు. అయితే జైల్లో ఉండి కూడా సుకేశ్‌ తన నేరాలను కొనసాగించినట్లు ఈడీ అధికారులు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.


Also Read: Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!


Also Read: Maa Robot: దివ్యాంగురాలైన కూతురు కోసం ఆ నాన్న అద్భుత ఆవిష్కరణ, రోబోతో సమస్యలకు చెక్