Sick Leopard: 



మధ్యప్రదేశ్‌లో ఘటన..


చిరుత పులులు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. అడవిలో ఆహారం దొరక్క గ్రామాల్లోకి వస్తున్నాయి. అక్కడ పశువులపై దాడి చేస్తున్నాయి. ఒక్కోసారి మనుషులనూ వేటాడి చంపుతున్నాయి. అందుకే...ఎక్కడ చిరుత కనిపించినా వెంటనే చంపేయాలని చూస్తున్నారు గ్రామస్థులు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన జరిగింది. ఇక్లేరా గ్రామంలోకి ఓ చిరుత వచ్చింది. దేవాల్ జిల్లాలోని అడవిలో సంచరిస్తున్న పులిని స్థానికులు గుర్తించారు. చూసీ చూడగానే భయంతో వణికిపోయారు. కానీ ఎంత సేపు చూసినా ఆ చిరుత గాండ్రించడం కానీ, దాడి చేయడం కానీ చేయలేదు. పైగా సాధు జంతువులా అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. అది అనారోగ్యంతో బాధ పడుతోందని గ్రామస్థులకు అర్థమైంది. ఈ విషయం తెలుసుకుని భారీ మొత్తంలో గ్రామస్థులు తరలి వచ్చారు. చిరుతను చూడాలని సరదా పడ్డారు. అక్కడి వరకూ వచ్చి ఆగిపోకుండా మరీ దగ్గరగా వెళ్లి సెల్పీలు తీసుకున్నారు. కొందరు వీడియో షూట్ చేశారు. మరో వ్యక్తైతే మరీ మితిమీరాడు. ఏకంగా ఆ చిరుతపై కూర్చుని స్వారీ చేశాడు. అయినా ఆ చిరుత ఏమీ అనలేదు. చుట్టూ అంత మంది ఉన్నా పిల్లిలా నడుచుకుంటూ పోయింది. అప్పటికే కొందరు ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అయ్యాయి కూడా. ఆ తరవాత ఓ గ్రామస్థుడు అటవీ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చేలోగా గ్రామస్థులు ఇలా రచ్చ చేశారు. కొందరైతే ఏకంగా చంపేద్దాం అనుకున్నారట. కానీ...అప్పటికే అధికారులు వచ్చి చిరుతను బంధించారు. అక్కడి నుంచి తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలారు. 


ఈ వైరల్ వీడియోని చూసిన నెటిజన్లు ఆ గ్రామస్థులపై మండి పడుతున్నారు. అడవులను నాశనం చేయడమే కాకుండా ఇప్పుడు వాటి జాతినీ అంతం చేయాలని చూస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. 


"ఇప్పటికే అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తున్నాం. అక్కడ జంతువులకు చోటు లేకుండా చేస్తున్నాం. అభివృద్ధి పేరుతో చెట్లు నరికేస్తున్నాం. ఇప్పుడు ఆ జంతువులనూ వేధిస్తున్నాం. మనం మనుషులమైనందుకు నిజంగా సిగ్గు పడాలి"


- ఓ నెటిజన్ 


అటవీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ చిరుత వయసు రెండేళ్లు. భోపాల్‌లోని వన్ విహార్‌లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. చిరుత ఆరోగ్యం బాగా క్షీణించిందని, అది పట్టించుకోకుండా గ్రామస్థులు దాన్ని ఇంకా భయపెట్టారని మండి పడ్డారు వైద్యులు. 


"చిరుత ఆరోగ్యం పరిస్థితి ఏమీ బాగోలేదు. అది గమనించకుండా గ్రామస్థులు దానితో ఆటలాడారు. మేం వెళ్లి వాళ్లందరినీ వెనక్కి పంపేశాం. వెటర్నరీ డాక్టర్ వచ్చి చిరుతను పరీక్షించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది"


- అటవీ అధికారులు