Vande Bharat Express: రైలు జర్నీని విమాన ప్రయాణంలా మార్చేశాయి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ వందే భారత్ రైళ్లు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఆధునికత, సాంకేతికత, భద్రత వంటి ఫీచర్లతో వందే భారత్ రైళ్లు ఆకట్టుకునేలా రూపొందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. క్రమంగా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం బ్లూ కలర్ వందే భారత్ రైళ్లను మనం చూస్తున్నాం. త్వరలోనే కాషాయ రంగులోనూ ఈ రైళ్లను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే ప్రయాణికుల మరింత మెరుగైన అనుభూతిని, ప్రయాణ అనుభవాన్ని అందించేలా మరిన్ని ఫీచర్లు తీసుకువస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొత్తగా వందే భారత్ రైళ్లలో జరగబోయే ఆ మార్పులు ఏంటో చూద్దామా..



  • వందే భారత్ రైళ్లలో సీట్ల కుషన్ గట్టిగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ లలో మెత్తటి కుషన్ లను వాడనున్నారు.

  • ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మారుస్తారు.

  • ఫుట్ రెస్ట్ ను మరింతగా పొడగించనున్నారు.

  • సీట్ల వెనక మ్యాగజైన్ బ్యాగ్స్ ఏర్పాటు చేయనున్నారు.

  • సీట్ల రిక్లైనింగ్ యాంగిల్ ను పెంచనున్నారు.

  • దివ్యాంగుల వీల్ ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్ ను ఏర్పాటు చేసి అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు.

  • అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్ తో మాట్లాడేందుకు బోర్డర్ లెస్ ఎమర్జెన్సీ బ్యాక్ యూనిట్ లు ఏర్పాటు చేయనున్నారు.

  • ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్ లో మార్పులు చేస్తారు.

  • కోచ్ లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ను మరింతగా మెరుగుపరుస్తారు.

  • ఎయిర్ టైట్ ప్యాన్సల్స్ లో మార్పులు చేయనున్నారు.

  • ఎమర్జెన్సీ పుష్ బటన్ ను మరింత సులువు చేయనున్నారు.

  • కోచ్ కు కోచ్ కు మధ్య అసెంబ్లీ యూనిట్ డోర్ ప్యానల్స్ ను మరింత పారదర్శకంగా రూపొందిస్తారు.

  • టాయిలెట్లలో లైటింగ్ మెరుగుపరుస్తారు. 1.5 వాట్ల నుంచి 2.5 వాట్ లకు పెంచుతారు.

  • నీటి ప్రవాహం మరింత మెరుగుపడేలా వాటర్ ట్యాప్ ఏరేటర్లు ఏర్పాటు చేస్తారు. 

  • గ్రిప్ మరింత మెరుగ్గా ఉండేలా అదనపు బెండ్ తో టాయిలెట్ హ్యాండిల్స్ లో మార్పులు చేయనున్నారు.

  • యాంటీ క్లైంబర్స్ అనే నూతన భద్రతా వ్యవస్థను తీసుకురానున్నారు.

  • రెసిస్టివ్ టచ్ నుంచి కెపాసిటివ్ టచ్ కి మార్చడం ద్వారా రాక్ లైట్ల కోసం స్మూత్ టచ్ కంట్రోల్స్ ఇస్తారు.

  • ట్రైలర్ కోచ్ లలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ డోర్ ల కోసం హాచ్ డోర్లు ఏర్పాటు చేయనున్నారు. 


ప్రస్తుతం వందే భారత్ రైళ్లలో ఏసీ ఛైర్ కార్ కోచ్ లు మాత్రమే ఉండగా.. త్వరలోనే స్లీపర్ కోచ్ లను పరిచయం చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 120 స్లీపర్ కోచ్ ల తయారీ కోసం రష్యాకు చెందిన ట్రాన్ మాష హోల్డింగ్ తో భారత్ కు చెందిన ఆర్‌విఎన్‌ఎల్‌ ఒప్పందం చేసుకుంది.