Women Misusing Anti-Rape Law: అత్యాచార నిరోధక చట్టంపై ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక దాడులు, అత్యాచారానికి గురైన వారికి న్యాయం చేయడానికి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని ఓ కేసు విచారణలో భాగంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తిన సమయంలో ఈ అత్యాచార నిరోధక చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై అతడి మాజీ ప్రియురాలు అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టగా.. ఆ కేసు న్యాయమూర్తి జస్టిస్ శరద్ కుమార్ శర్మతో కూడిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. 


పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత వివాహానికి నిరాకరించడంతో ఓ వ్యక్తిపై మహిళ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు వేశారు. ఈ కేసులో పిటిషన్, నిందితుడు ఇద్దరూ 2005 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి ఉద్యోగం వచ్చినా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. క్రమంగా వారి మధ్య ప్రేమ బంధం గాఢత పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో వారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ మహిళను తనకు న్యాయం చేయాలంటూ 2020, జూన్ 30వ తేదీన కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ వ్యక్తికి పెళ్లి అయిన తర్వాత కూడా వారిద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు. ఎంతకీ తనను పెళ్లి చేసుకోకపోవడంతో ఆ మహిళ జూన్ 30వ తేదీన కోర్టును ఆశ్రయించారు.


సదరు వ్యక్తి తనను అత్యాచారం చేశాడని, న్యాయం చేయాలంటూ పిటిషన్ లో కోరారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ' అతడికి పెళ్లి అయన తర్వాత కూడా మహిళ ఆ వ్యక్తితో తన బంధాన్ని కొనసాగించారు. అంటే.. ఆమెకు అతడితో బంధం అంగీకరించినట్లే' అని జస్టిస్ శరద్ కుమార్ శర్మ వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అనే విషయాన్ని తమ బంధం తొలినాళ్లలోనే తేల్చుకోవాల్సింది అని అన్నారు. పరస్పర అంగీకారంతో శారీరకంగా దగ్గరైన తర్వాత పెళ్లికి నిరాకరిస్తే అది అత్యాచారంగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మహిళ చేసిన అభ్యర్థనను, అత్యాచార కేసును కొట్టివేసింది. భారతీయ శిక్షాస్మృతి- ఐపీసీలోని సెక్షన్ 376 ను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.