Ludo Game Woman Bets Self : లూడో గేమ్ వ్యసనంగా మారిన ఓ మహిళ పందెంలో తనను తాను పణంగా పెట్టుకుంది. లూడో ఆటలో వేల రూపాయలు పందెం కాసింది. డబ్బులు అయిపోవడంతో తననే పందెంగా కాసింది. చివరకు ఆటలో ఓడిపోయి యాజమాని దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు ఫోన్ చేసి చెప్పడంతో అతడు అవాక్కయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.  


 అసలేం జరిగింది? 


ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఒక మహిళ తన వద్ద పందెం కాసింది. లూడో గేమ్ లో తన యజమాని చేతిలో ఓడిపోయి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో పనిచేస్తున్న తన భర్త పంపిన డబ్బుతో రేణు అనే మహిళ జూదం ఆడేది. ఆ మహిళ లూడో గేమ్‌కు బానిసైంది. ఆమె తన ఇంటి యజమానితో రోజూ ఆట ఆడేది. అలాంటిది ఒకరోజు ఇద్దరూ ఆటలు ఆడుతూ బెట్టింగ్‌లు కడుతున్నప్పుడు ఆ మహిళ తన వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోవడంతో తనను పణంగా పెట్టింది. భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఆమె భర్త ప్రతాప్‌గఢ్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను దేవ్‌కలిలో అద్దె ఇంట్లో ఉండేవాడినని రేణు భర్త పేర్కొన్నాడు. ఆరు నెలల క్రితం, అతను జైపూర్‌కు పని కోసం వెళ్లి తన భార్యకు డబ్బు పంపిస్తూనే ఉన్నాడు. ఆమె జూదం కోసం ఆ డబ్బు ఉపయోగించేది. లూడోపై పందెంలో డబ్బు అయిపోయిన తర్వాత తనను తాను పందెంగా పెట్టి ఓడిపోయింది.  


తనను తాను పందెంగా పెట్టి ఆట 


ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన రేణుకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణు భర్త ఉపాధి కోసం ఆరు నెలల క్రితం రాజస్థాన్‌ వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేస్తూ ఉత్తర్ ప్రదేశ్ లోని తన భార్యకు డబ్బు పంపించేవాడు. అయితే లూడో గేమ్ కు బానిసైన రేణు భర్త పంపిన డబ్బును బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకునేది. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానితో తరచూ లూడో గేమ్‌ ఆడే రేణు ఓ రోజు బెట్టింగ్‌లో డబ్బు మొత్తం పోగొట్టుకుంది. అక్కడితో ఆగకుండా చివరకు తనను తానే పందెం కాసి ఆట ఆడింది. ఆ ఆటలో రేణు ఓడిపోవడంతో యజమాని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని రేణు తన భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో అతడు ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌కు వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అయితే లూడో ఓడిపోయి ఇంటి యజమానితో కలిసి ఉంటున్న రేణు ఇప్పుడు అతడిని విడిచిరానని చెబుతోంది.