UP Crime News: 


యూపీలో ఘటన..


యూపీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో అనూహ్య ఘటన జరిగింది. పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ కోసం వచ్చిన మహిళను అనుకోకుండా గన్‌తో కాల్చాడు ఓ పోలీస్. గన్‌ని చెక్ చేస్తూ ట్రిగ్గర్ నొక్కాడు. ఎదురుగా ఉన్న మహిళ తలలోకి నేరుగా బులెట్ దూసుకుపోయింది. వెంటనే ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. అక్కడి సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితురాలిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే..బాధితురాలి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. లంచమిస్తే తప్ప పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పూర్తి కాదని బెదిరించినట్టు చెప్పారు. ఆ సమయంలోనే ఆ పోలీస్‌కి, తమకి మధ్య వాగ్వాదం జరిగినట్టు వివరించారు. సరిగ్గా అప్పుడే ఆయన గన్ చేతుల్లోకి తీసుకోవడం, ఆ తరవాత కాల్చడం జరిగాయి. ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 


"పాస్‌పోర్ట్ ఎంక్వైరీ కోసం ఆమె పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. అప్పటికే ఆ పోలీస్ ఆమెని వేధించాడు. వెరిఫికేషన్‌ పూర్తవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఆమెని ఎవరు ఎలా కాల్చారో తెలియదు. ఎంత డబ్బు డిమాండ్ చేశారన్నదీ తెలియదు. కానీ...ఆ పోలీస్‌కి, ఆమెకి మధ్య వాగ్వాదం జరిగిందనైతే తెలుసు"


- బాధితురాలి బంధువు


ఇలా జరిగింది..


పాస్‌పోర్ట్ ఎంక్వైరీ కోసం ఓ వ్యక్తితో కలిసి పోలీస్‌ స్టేషన్‌కి వచ్చింది ఆ మహిళ. ఆ సమయంలోనే ఎదురుగా ఉన్న పోలీస్‌ తన కొలీగ్ నుంచి గన్‌ తీసుకున్నాడు. గన్‌ని టెస్ట్ చేశాడు. ఆ సమయంలోనే ట్రిగ్గర్ నొక్కినట్టు ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనకు కారణమైన ఇన్‌స్పెక్టర్‌ని డిపార్ట్‌మెంట్ వెంటనే సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.