Tihar Jail News: దేశ రాజధాని దిల్లీలోని తిహార్‌ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియాపై ప్రత్యర్థి గ్యాంగ్ దాడి చేసి చంపేసింది. ఈరోజు ఉదయం 6.30 గంటలకు ఇనుప రాడ్లతో కొట్టి మరీ హత్య చేశారని జైలు అదికారులు చెబుతున్నారు. 


అసలేం జరిగిందంటే..?


దిల్లీ తిహార్‌ జైల్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో హై రిస్క్ వార్డులో ఉన్న టిల్లు అలియాస్ సునీల్ మాన్ పై మరో గ్యాంగ్ స్టర్ యోగేష్ తుండా, అతడి అనుచరులు దాడి చేశారు. ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు. జైలు అధికారులు గమనించి దాడిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టిల్లును హుటాహుటిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిల్లు తాజ్ పురియా... దిల్లీలోని అత్యంత క్రూరమైన క్రిమినల్ గ్యాంగ్ కు నేతృత్వం వహిస్తున్నాడు. 2015లో ఓ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి తిహార్‌ జైల్లో ఉంటున్నాడు. టిల్లు గ్యాంగ్ కు దిల్లీకి చెందిన మరో గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగితో ఏళ్ల తరబడి శత్రుత్వం ఉంది. 2021 సెప్టెంబర్ లో గోగి దిల్లీలోని రోహిణీ కోర్టులో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కేసు విచారణ నిమిత్తం అతడిని కోర్టుకు తీసుకురాగా... అదే సమయంలో న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు టిల్లు అనుచరులు.. కోర్డు ఆవరణలోనే గోగిపై కాల్పులకు తెగబడ్డారు. 


దాదాపు 35 నుంచి 40 రౌండ్ల కాల్పులు జరిపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దాడిలో జితేందర్ అక్కడికక్కడే మరణించాడు. ఈ కాల్పులను తిహార్‌ జైలు నుంచి టిల్లు ఫోన్ లో పర్యవేక్షించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రోహిణి కోర్టు ఘటనలో టిల్లు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తాజాగా టిల్లుపై దాడి చేసిన యోగేషే.. గోగి గ్యాంగ్ కు చెందిన షార్ప్ షూటర్ అని తెలుస్తోంది. గోగి హత్యకు ప్రతీకారంగానే యోగేష్, టిల్లును హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.