తమిళనాడులో ఇద్దరు కొడుకులు కన్న తల్లి పట్ల కర్కశత్వం ప్రదర్శించారు. తమిళనాడులోని తంజావూరులో ఈ ఘటన జరిగింది. కన్న తల్లి అని కూడా చూడకుండా ఏకంగా ఆమెను పదేళ్ల నుంచి గదిలోనే బంధించారు. కుమారులు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా బాగా ఉన్నా కూడా తల్లిని పదేళ్ల నుంచి బంధించి హింసించిన ఘటన మాత్రం విపరీతంగా విస్మయానికి గురి చేస్తోంది. తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా కావేరినగర్‌కు చెందిన జ్ఞానజ్యోతి (72)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు షణ్ముగసుందరన్‌ చెన్నైలో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు వెంకటేశన్‌ దూరదర్శన్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. 


పది సంవత్సరాల క్రితమే జ్ఞానజ్యోతి భర్త, కుమార్తె చనిపోయారు. కుమారులు ఆస్తి గొడవల కారణంగా వేరు వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తల్లిని పట్టించుకోకుండా పదేళ్ల కిందటే ఆమెను ఓ ఇంట్లో బంధించారు. వారానికోసారి వచ్చి బిస్కెట్లు తెచ్చి గేట్‌లోంచి లోపలికి విసిరేసి వెళ్లేవారని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఆమె పరిస్థితి స్థానికులు గమనించి వారే ఆహారం పెట్టేవారు. ఇటీవల ఈమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చూడగా.. ఓ సామాజిక కార్యకర్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు స్పందించి ఆమెను రక్షించారు. అయితే, బాధితురాలి మానసిక పరిస్థితి బాగా లేదని అధికారులు గుర్తించారు. చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు.


జ్ఞానజ్యోతి కుమారులు షణ్ముగ సుందరన్‌, వెంకటేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన ఒకరోజు తర్వాత నిన్న వారు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టంలోని సెక్షన్ 24 కింద కేసు నమోదు చేశారు. 


పెద్ద కుమారుడు షణ్ముగసుందరం విలేకరులతో మాట్లాడుతూ.. తన తమ్ముడు వెంకటేశన్ తన తల్లికి వచ్చే పింఛను రూ.30 వేలను ప్రతినెలా వాడుకుంటున్నాడని, కాబట్టి, తన తల్లి ఆరోగ్యానికి అతనే కారణమని తన తమ్ముడిని నిందించాడు. స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు వెల్లడించిన ప్రకారం.. 72 ఏళ్ల జ్ఞానజ్యోతి తన ఇంట్లో వివస్త్రగా పడి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు చూశారు. వారి నుండి వచ్చిన సమాచారంతో అధికారులు ఆమెను రక్షించారు. మహిళను తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చామని, ఆమె త్వరగా కోలుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరామని జిల్లా కలెక్టర్ దినేష్ పొన్‌రాజ్ ఆలివర్ తెలిపారు.