Rajasthan minister on chandrayan 3:  భారత్‌ సగర్వంగా చంద్రయాన్‌ ౩ మిషన్‌ను విజయవంతం చేసిన విషయం తెలిసిందే. ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్‌ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తిని చాటింది. విద్యార్థులు, సాధారణ ప్రజలు సైతం చంద్రయాన్‌ ౩ను ఎంతో ఆసక్తిగా గమనించారు. అలాంటిది రాజస్థాన్‌ క్రీడా శాఖ మంత్రి అశోక్ చంద్నా మాత్రం చంద్రయాన్‌ ౩ గురించి సరిగ్గా తెలుసుకోనట్టున్నారు. ఫలితంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు.


చంద్రయాన్‌ ౩ విజయవంతం అయిన సందర్భంగా కాంగ్రెస్‌ నేత అశోక్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్‌ ౩ లో ప్రయాణించిన వ్యోమగాములకు నా సెల్యూట్‌ అంటూ గొప్పగా చెప్పారు. చంద్రుడిపై సేఫ్‌ ల్యాండ్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉందని, అందులో ప్రయాణించిన వారికి సెల్యూట్‌ చేస్తున్నానని, సైన్స్‌ స్పేస్‌ రిసెర్చిలో ఇండియా మరో అడుగు వేసిందని, ఈ సందర్భంగా భారత పౌరులందరికీ కూడా శుభాంకాక్షలు చెప్తున్నానని అన్నారు. 






ఇంకేముందు దొరకిపోయారు. ఆయన చంద్రయాన్‌ ౩ ద్వారా ఇస్రో వ్యోమగాములను జాబిల్లిపైకి పంపిస్తోందని అనుకుంటున్నారు. ఇది మానవ రహిత మిషన్‌ అనే విషయం కూడా ఆయనకు తెలియదు. ఆయన ఏమాత్రం ఐడియా లేకుండా సాధారణంగా మీడియాతో మాట్లాడేసి వెళ్లిపోయారు. కానీ ఆ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది. నెటిజన్లు క్రీడా శాఖ మంత్రికి కనీసం చంద్రయాన్‌ ౩ మానవ రహిత మిషన్‌ అనే విషయం కూడా అని తెగ ట్రోల్‌ చేస్తున్నారు. బోలెడన్ని జోకులు వేస్తున్నారు. సీక్రెట్‌ న్యూస్‌ లీకైందని, రాజస్థాన్‌ మంత్రి సీక్రెట్‌గా వ్యోమగామిని చంద్రుడిపైకి పంపారని ఇలా పలు రకాలు జోకులు ట్విట్టర్‌లో కనిపిస్తున్నాయి.


ఎన్నో ఏళ్లుగా కలలు గంటున్న లక్ష్యాన్ని నిన్న ఇస్రో సాకారం చేసింది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకానిది భారత్‌ సాధించి చూపించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌ ౩ ల్యాండర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇది చరిత్రాత్మకమైన ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తంచేశారు. దేశమంతా నిన్న మిషన్‌ సక్సెస్‌పై సంబురాలు చేసుకున్నారు. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన ల్యాండర్‌ విక్రమ్‌ అక్కడి నుంచి ఫొటోలను కూడా పంపిస్తోంది. ఇస్రో బెంగుళూరు కేంద్రానికి, ల్యాండర్‌కు కనెక్షన్‌ ఏర్పడిందని.. ఫొటోలు వస్తున్నాయని ఇస్రో వెల్లడించింది.