Naveen Body Reached Karnataka from Ukraine: ఉక్రెయిన్​లో రష్యా దాడుల్లో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్​ శేఖరప్ప మృతదేహం నేటి (సోమవారం) తెల్లవారుజామున మూడు గంటలకు కర్ణాటకకు చేరుకుంది. దాదాపు మూడు వారాల కిందట ఉక్రెయిన్‌లో నవీన్ చనిపోగా, భారత్‌కు తీసుకురావడానికి ఇన్ని రోజులు పట్టింది. నేటి ఉదయం బెంగళూరులోని కెంపే గౌడ ఎయిర్‌పోర్టుకు నవీన్​ పార్థివదేహం చేరుకోగా కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై నివాళులు అర్పించారు. ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లిన నవీన్ దురదృష్టవశాత్తూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయాడు.







మెడికల్ కాలేజీకి డెడ్‌బాడీ.. 
ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న నవీన్ ఖార్కీవ్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. ఈ క్రమంలో రష్యా జరిపిన బాంబు దాడులు, పేలుళ్లలో మార్చి 1న కర్ణాటకకు చెందిన నవీన్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఎలాగైనా సరే నవీన్ మృతదేహాన్ని భారత్​కు తీసుకురావాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్ అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ, అధికారులు మాట్లాడి నవీన్ మృతదేహాన్ని భారత్​కు తీసుకొచ్చారు. తమ కుమారుడి మృతదేహాన్ని దేవనాగరెలోని ఎస్​ఎస్​ మెడికల్​ కాలేజీకి దానం చేయాలని నవీన్ కుటుంబం కొన్ని రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. 







ప్రధానికి కర్ణాటక సీఎం కృతజ్ఞతలు
ఉక్రెయిన్ నుంచి నవీన్ మృతదేహాన్ని భారత్​కు రప్పించడంలో సహాయం చేసినందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కర్ణాటక ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ఈ విషయంపై చర్చించింది. తమకు త్రివర్ణ పతాకం బిల్డింగ్ మీద ఉంచాలని, అదే మీకు శ్రీరామరక్ష అని అధికారులు సూచించినట్లు నవీన్ చనిపోయే ఒకట్రెండు రోజుల ముందు తండ్రి అతడికి సూచించారు. కానీ జరగరాని నష్టం జరిగిపోయింది.


Also Read: Russia-Ukraine Conflict: పుతిన్ తో చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్దమే : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ


Also Read: Kinzhal Hypersonic Missile: ఉక్రెయిన్‌పై ఉక్కుపాదం - తొలిసారి హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగించిన రష్యా