Kolkata News: కోల్‌కత ఆర్జీకర్ హాస్పిటల్‌ రేప్ అండ్ మర్డర్‌ కేసుకు సంబంధించి వెస్ట్‌ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.. కీలక స్థానాల్లో ఉన్న అధికారులపై కఠిన చర్యలు చేపట్టారు. ఆగస్టు 9న వైద్య విద్యార్థినిపై అఘాయిత్యం హత్యోదంతం వెలుగు చూడగా.. మరుసటి రోజు ఆగస్టు 10 నుంచి బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసనలు చేపడుతున్న జూనియర్ వైద్యులతో కాలిఘాట్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి మమత సోమవారం (సెప్టెంబర్ 16)న సుమారు 6 గంటలపాటు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


జూడాలతో జరిపిన చర్చల్లో దాదాపు 42 మంది జూనియర్ వైద్యులు పాల్గొని తమ ఐదు డిమాండ్లను మమత ముందు ఉంచారు. వారి డిమాండ్లకు అనుగుణంగా ఒక సెక్షన్‌ ఆఫ్ పోలీసులను ముఖ్యంగా కోల్‌కత పోలీసు కమిషనర్ వినీత్‌ గోయల్‌, టాప్ వైద్యాధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు డైరెక్టర్‌ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ కౌస్తవ్‌ నాయక్‌తో పాటు హెల్త్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ దేవాశిశ్ హల్దేర్‌లపైనా చర్యలు తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్న వైద్యుడుకి లంచం ఇవ్వజూపిన నార్త్‌ డివిజన్ డిప్యూటీ కమిషనర్‌పైనా చర్యలకు మమత ఆదేశించారు.


మంగళవారం సాయంత్రం 4 గంటల సమయానికల్లా కొల్‌కతాకు కొత్త కమిషనర్‌ను నియమిస్తామని తెలిపారు. మంగళవారం నాడు సుప్రీంకోర్టులో ఆర్‌జీకర్‌ కేసుకు సంబంధించిన హియరింగ్ ఉండగా.. కొద్ది గంటల ముందు మమత జూనియర్‌ వైద్యులతో చర్చలు చేపట్టడం గమనార్హం. జూనియర్ వైద్యులు 38 రోజులుగా అన్ని రకాల సేవలకు దూరంగా ఉంటూ నిరసనల్లో పాల్గొంటున్నారు. జూనియర్ వైద్యులు తమ ముందు ఉంచిన అన్ని డిమాండ్లను దాదాపు 99 శాతం నెరవేర్చామన్న మమత.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని  ఇప్పటికైనా జూనియర్ వైద్యులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు.



ముఖ్యమంత్రి మాటలు చర్యలుగా మారేవరకూ నిరసన కొనసాగిస్తామన్న వైద్యులు


ముఖ్యమంత్రి మమతతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన జూనియర్ వైద్యులు.. తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఎం చెప్పిన మాటలన్నీ కార్యరూపంలోకి వచ్చిన తర్వాతే విధుల్లో పాల్గొంటామని అన్నారు.


ప్రజాగ్రహంతోనే ప్రభుత్వం దిగివచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  సుప్రీం కోర్టు మంగళవారం నాటి హియరింగ్‌లో ఇచ్చే ఆదేశాలు సహా ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని జూనియర్ వైద్యుడు దెబాశిశ్ హల్దేర్ తెలిపారు. స్వాస్త్య భవన్ ఎదురుగా అప్పటి వరకూ తమ నిరసన కొనసాగుతుందన్నారు. విధుల్లో అలసత్వం వహించడం సహా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న జూడాలు.. ఆస్పత్తుల్లో వైద్యుల భద్రత సహా కరప్షన్ రాకెట్‌, సిండికేట్ నిర్మూలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి వైద్యుల రక్షణకు సంబంధించి హాస్పిటల్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి వంద కోట్లు విడుదల సహా పేషెంట్ వెల్‌ఫేర్‌ కమిటీని పూర్తిగా రద్దు చేసి కొత్త కమిటీ వేయాలన్న ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం కుదిరిందని వైద్యులు తెలిపారు.






గతంలో మూడు సార్లు జూనియర్ వైద్యులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా.. సోమవారం నాటి చర్చలు కొంత మేర ఫలించాయి. సోమవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు జూడాలు చర్చలకు వెళ్లగా అవి రెండు గంటల పాటు కొనసాగాయి. ఆ తర్వాత మీటింగ్ మినిట్స్ ఫైనలైజ్ చేయడానికి మరో మూడు గంటలు పట్టాయి. చివరకు జూనియర్ వైద్యులు ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదిరిన అంశాలను మినిట్స్‌లో పొందుపరిచి సంతకాలు చేసిన దస్త్రాలను ప్రభుత్వం విడుదల చేసింది.


Also Read: వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !