Rajasthan Election 2023:

  


రాజస్థాన్‌ ఓటర్ల నాడి..


రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ (Rajasthan Assembly Election) ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎలాగైనా ఈ రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. పైగా అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉందని గట్టిగానే ప్రచారం చేస్తోంది. గహ్లోట్ వర్సెస్ పైలట్ వివాదమూ రాజకీయ అనిశ్చితిని సృష్టించింది. ఈ క్రమంలోనే ABP Cvoter Final Opinion Poll రాష్ట్ర ఎన్నికలపై కీలక విషయాలు వెల్లడించింది. ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వేలో ఈసారి రాజస్థాన్ లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రజలను ప్రశ్నించింది.  కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రజలు జోస్యం చెప్పారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ కు 67 నుంచి 77 సీట్లు, బీజేపీకి 114 నుంచి 124 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ఇతరులు 5 నుంచి 13 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే అంచనా  వేసింది. అయితే...ఎన్నికలపై ఏయే అంశాలు ప్రభావం చూపిస్తాయో ఈ ఒపీనియన్ పోల్‌ వెల్లడించింది. 


ఏయే అంశాల ప్రభావం ఎంత..?


రాజస్థాన్‌లో నిరుద్యోగం ఎక్కువగా ఉందన్న బీజేపీ మొదటి నుంచి విమర్శిస్తూనే ఉంది. ఇప్పుడు ఒపీనియన్ పోల్‌లోనూ ఎన్నికలపై ఈ అంశం ప్రభావం చూపిస్తుందని తేలింది. 28.2% మేర ఈ ఎఫెక్ట్ కనిపించే అవకాశాలున్నాయి. ఇక మౌలిక వసతులైన విద్యుత్, నీళ్లు, రహదారుల అంశం 6.7% మేర ప్రభావం చూపనుంది. శాంతి భద్రతలు, మహిళా భద్రత అంశం 6.6% మేర ప్రభావం చూపించనుందని ఈ పోల్ వెల్లడించింది. ప్రభుత్వ అవినీతి ఎన్నికలపై 6.2% మేర ఎఫెక్ట్ చూపించనుందని, అలాగే..ద్రవ్యోల్బణం ప్రభావం 25.5% వరకూ ఉంటుందని అంచనా వేసింది. ఇతరత్రా సమస్యల ప్రభావం 26.7% వరకూ ఉండనుంది. 


ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా..?


గహ్లోట్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉండి, గవర్నమెంట్‌ని మార్చేయాలని అనుకుంటున్న వాళ్ల సంఖ్య 49.2%గా ఉంది. అసంతృప్తితో ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని మార్చడానికి ఇష్టపడని వాళ్లు 5.3% మంది. అసంతృప్తి లేని, ప్రభుత్వాన్ని మార్చాలి అనుకోని వాళ్ల సంఖ్య 45.5% గా ఉన్నట్టు ఈ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై 35% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మేర సంతృప్తిగా ఉన్న వాళ్ల సంఖ్య 35.8% మంది ఉన్నారు. పూర్తి అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్లు 28.2% మంది. ఏమీ చెప్పలేం అన్న వాళ్ల సంఖ్య 1.0%గా ఉన్నట్టు ఒపీనియన్ పోల్‌ తెలిపింది. 




గహ్లోట్‌ రిపోర్ట్‌ కార్డ్..


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్‌ (Ashok Gehlot) పని తీరుపై 47.6% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కొంత వరకూ పరవాలేదు అని తమ అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్లు 24.4% మంది ఉన్నారు. ముఖ్యమంత్రి పని తీరు ఏ మాత్రం బాగోలేదన్న వాళ్ల సంఖ్య 27.7% గా ఉంది. ఏమీ చెప్పలేమన్న వాళ్లు 0.4%గా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పని తీరుపై రాజస్థాన్‌లో 50.9% మంది అనుకూలంగా ఓటు వేశారు. పరవాలేదు అన్న వాళ్ల సంఖ్య 28.1% గా ఉంది. ఏ మాత్రం నచ్చలేదు అని 20.9% మంది చెప్పారు. రాహుల్ గాంధీకి అనుకూలంగా 32.1% మంది ఓటు వేయగా..వ్యతిరేకంగా 14.6% మంది ఓటు వేశారు. 


Also Read: Telangana Election: BRS ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఏం చెప్పింది?