Rahul Gandhi: రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు పూర్తి బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మద్ధతుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయంగా భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు, మెడల్స్ తీసుకొచ్చిన రెజ్లర్లు నెలకు పైగా పోరాటం చేస్తున్నారని రాహుల్ అన్నారు. రెజ్లర్లకు మద్దతుగా రాహుల్ ట్వీట్ చేశారు. '25 అంతర్జాతీయ పతకాలు తెచ్చిపెట్టిన భరతమాత బిడ్డలు ఇప్పుడు న్యాయం కోసం నెల రోజులుగా వీధుల్లో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. 2 ఎఫ్ఐఆర్ లలో 15 లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మాత్రం ప్రధాన మంత్రి సురక్షా కవచంలో సురక్షితంగా ఉన్నారని తెలిపారు. మహిళా రెజ్లర్లు పడుతున్న ఈ అవస్థలకు మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 


వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించాడని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ నిరసనలపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఓ కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన కమిటీ.. ప్రభుత్వానికి తమ నివేదికను అందజేసింది. అయితే ఈ నివేదికలో ఆ కమిటీ ఏ రిపోర్టు ఇచ్చిందో బహిర్గతం చేయలేదు. ఈ కమిటీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. దీంతో రెజ్లర్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని, రెజ్లర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. 






మే 28వ తేదీన పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు అంతా కలిసి పార్లమెంట్ వరకు ర్యాలీగా వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. దీని గురించి తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు వారందరినీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ క్రీడాకారులపై అలా ప్రవర్తించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ప్రతిపక్షాలు మోదీ సర్కారును, ఢిల్లీ పోలీసులను తీవ్రంగా విమర్శించారు. 


ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన రెజ్లర్లు.. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ జరిగిన లైంగిక వేధింపులపై న్యాయం చేయాలని దేశానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు పలుమార్లు రిక్వెస్ట్ చేసినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం గానీ రెజ్లర్లు పట్టించుకోలేదని వాపోయారు. తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్.. తాము సాధించిన పతకాలను, పురస్కారాలను గంగా నదిలో పారవేసి అనంతరం ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. 


రెజ్లర్లు అందరి పతకాలను మూటకట్టి గంగా నదిలో పారవేయాలని సిద్ధమైన సమయంలో రైతు ఉద్యమ నేత నరేష్ టికాయత్ అక్కడికి చేరుకున్నారు. రెజ్లర్ల సమస్యకు పరిష్కారం వెతుకుదామని, ప్రస్తుతానికి పతకాలను గంగలో పారవేయడాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. రెజ్లర్ల చేతిలో ఉన్న పతకాల మూటను తీసుకుని, సమస్య పరిష్కారం కోసం నరేష్ టికాయత్ ఐదు రోజులు గడువు ఇవ్వాలని కోరగా మహిళా రెజ్లర్లు కన్నీళ్లు పెట్టుకుంటూనే అందుకు ఓకే చెప్పారు.