PM Modi Adilabad Tour: ఆదిలాబాద్‌లో అధికారిక కార్యక్రమాలు పూర్తైన తర్వాత బీజేపీ విజయ సంకల్ప సభను ఏర్పాటు చేసింది. తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన సభకు హాజరైన ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ... పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా వచ్చే మార్పు ఏమీ ఉండబోదని పెదవి విరించారు. రెండు పార్టీల విధానం ఒక్కటేనని విమర్శించారు. కుటుంబ పాలనలో ఒకటి దోచుకోవడం రెండు అబద్దాలు వ్యాప్తి చేయడమే వారి విధానాలు అని విమర్శలు చేశారు. 


కాళేశ్వరంలో అవినీతి జరిగిందని విమర్శలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తోందని ప్రశ్నించారు మోదీ. కుటుంబ పాలనలో ఉన్న పార్టీలన్నీ ఒక్కటవుతాయని వారిని నమ్మొద్దని ప్రజలకు మోదీ సూచించారు.  బీజేపీ మాత్రమే దేశాభివృద్ధి లక్ష్యంతో పాలన చేస్తుందని తెలిపారు. 


ప్రస్తుతం తాను చేస్తున్న పర్యటనలు ఎన్నికలకు సంబంధం లేదన్న మోదీ... తాను వికసిత్‌ భారత్‌లో భాగమవ్వాలని ప్రజలను కోరేందుకే వస్తున్నట్టు ప్రకటించారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వాటిలో చాలా ప్రాజెక్టులు తెలంగాణకు కేటాయించినట్టు వివరించారు మోదీ. రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ ఇవాళ ప్రారంభంచిన మరికొన్ని ప్రాజెక్టులు అన్నింటిని కూడా ప్రజలకు తెలిపారు. 


ఆదిలాబాద్‌కు చాలా హిస్టరీ ఉందని ఎందరో స్ఫూర్తినిచ్చే నేతలు ఉన్నారని అన్నారు మోదీ. ఇలాంటి ప్రాంతం నుంచే ముర్ము అనే మహిళ రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. తెలంగాణలోని గిరిజన నేతల్లో కూడా పేరున్న వాళ్లు ఉన్నారని వివరించారు. రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని... సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డు ఇలా చాలా విషయాల్లో తెలంగాణకు తోడ్పాటు అందిస్తున్నామన్నారు.