Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల వేళ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ కీలక భేటీకి టీఆర్ఎస్, ఆమ్‌ఆద్మీ, బీజేడీ పార్టీలు గైర్హాజరయ్యాయి. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఈ భేటీ జరుగుతోంది.






17 పార్టీలు


ఈ సమావేశానికి 17 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. టీఎంసీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (M), సీపీఐఎమ్‌ఎల్, ఆర్‌ఎస్‌పీ, శివసేన, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, ఎస్‌పీ, నేషనల్ కాన్ఫెరెన్స్, పీడీపీ, జేడీ(S), డీఎమ్‌కే, ఆర్‌ఎల్‌డీ, ఐయూఎమ్ఎల్, జేఎమ్ఎమ్ పార్టీల నేతలు ఈ సమావేశానికి వచ్చారు.


KK షాక్!


ప్రతిపక్షాల ఐక్యతలో కీలకంగా వ్యవహరిస్తారని భావించిన తెలంగాణ సీఎం కేసీఆర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ భేటీకి హాజరుకాకపోవడం దీదీకి పెద్ద మైనస్ అని విశ్లేషకుల మాట. ఇప్పటికే ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పాల్గొనలేరని శివసేన ప్రకటించింది. మరోవైపు బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కూడా ఈ భేటీకి డుమ్మా కొట్టారు.


మరోవైపు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మాత్రమే ఈ వ్యవహారంపై స్పందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని ఈ భేటీ పిలవడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఈ సమావేశానికి గైర్హాజరైంది.


విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని నిర్మించే చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.


కాంగ్రెస్ తరఫున


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈ భేటీకి ఆహ్వానించినప్పటికీ, ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఈ భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్ లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎన్నుకోవడం సాధ్యంకాదని, ఎందుకంటే, కాంగ్రెస్‌కు 50 శాతం ఓట్లు ఉన్నాయని ఖర్గే అన్నారు. 


అభ్యర్థి ఎవరు?


శరద్ పవార్‌ను ప్రతిపక్షాల అభ్యర్థిగా నిలపాలని మమతా బెనర్జీ గట్టిగా పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవార్ ససేమిరా అన్నట్లు సమాచారం. 


Also Read: Congress Protest: 21 గంటలు, 80 ప్రశ్నలు- వరుసగా మూడో రోజూ రాహుల్ గాంధీ విచారణ


Also Read: Viral News: ఇంగ్లీష్‌లో 35 వచ్చాయ్ సర్, మ్యాథ్స్‌లో 36 వచ్చాయండి- కానీ కలెక్టర్ అయ్యారు కదా!