పబ్‌జీ ఇంకా బ్యాన్ కాలేదా..? 


పబ్‌జీ ఉంటే చాలు. తిండి, తిప్పల్ని కూడా మర్చిపోతారు. బస్‌లలో, ట్రైన్లలో ఎక్కడ కాస్త ఖాళీ సమయం దొరికినా ఈ గేమ్‌కు అతుక్కుపోతారు. అంతెందుకు కొంత మంది విద్యార్థులు స్కూల్‌లు, కాలేజీల్లోనూ సీక్రెట్‌గా మొబైల్ తీసుకెళ్లి ఆడుతున్న సంఘటనలూ చూశాం. తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పబ్‌జీపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. క్రైమ్‌ని ప్రోత్సహించే విధంగా ఉందంటూ మండిపడ్డారు. ఈ విమర్శల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ గేమ్‌ని బ్యాన్ చేసింది. ఈ నిర్ణయంతో పబ్‌జీ లవర్స్ అంతా షాక్ అయ్యారు. కానీ ఈ గేమ్‌ని బ్యాన్‌ చేసినా ఇంకా కొందరికి అందుబాటులోనే ఉంటోంది. ఇదే విషయమై వివరణ కోరింది నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్-NCPCR. బ్యాన్ చేసిన గేమ్ భారత్‌లో ఎలా అందుబాటులో ఉందో చెప్పాలంటూ ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్-IOAకి కూడా లేఖ పంపింది NCPCR. పబ్‌జీతోపాటు బ్యాన్ అయిన ఇతర ఆన్‌లైన్‌ గేమ్స్‌ స్టేటస్ ఏంటో చెప్పాలని అడిగింది. 


పబ్‌జీ మత్తులో పడి తల్లిని చంపిన బాలుడు


అసలు ఇప్పుడు పబ్‌జీ మరోసారి వార్తల్లోకి రావటానికి ఓ కారణముంది. పబ్‌జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించినందుకు లఖ్‌నవూలోని ఓ బాలుడు కన్నతల్లినే కాల్చి చంపాడు. ఆర్మీలో పని చేసే తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో తల్లిని హత్య చేయటం సంచలనమైంది. పబ్‌జీ పనైపోయిందనుకుంటున్న తరుణంలో మరోసారి ఈ ఘటన జరగటం అందరినీ ఆందోళనకు గురి చేసింది. హత్య చేసిన తరవాత దాదాపు 
మూడు రోజుల పాటు శవంతో ఇంట్లోనే ఉండిపోయాడు ఆ బాలుడు. పొరుగింటి వాళ్లకు అనుమానం రాకుండా రూమ్ ఫ్రెష్‌నర్స్‌ వినియోగించాడు. పబ్‌జీ కారణంగా ఇలాంటి నేరాలు జరగటం ఇదే తొలిసారేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఓ 14 ఏళ్ల బాలుడు పబ్‌జీ మత్తులో పడిపోయాడు. ఆడొద్దని వారించినందుకు కుటుంబ సభ్యుల్ని తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటన. భారత్‌లోనూ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం వల్ల కేంద్రం బ్యాన్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో నిర్వహించిన సందర్భంలో ఓ తల్లి తన కుమారుడు పబ్‌జీకి బానిసైపోయాడంటూ వాపోయింది. పబ్‌జీ వాలా హై క్యా అంటూ ప్రధాని నరేంద్రమోదీ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ సమస్య తీవ్రమవుతూనే వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ గేమ్ వెలుగులోకి వచ్చే సరికి ఉలిక్కిపడ్డారంతా.