Independence Day Celebrations : ఢిల్లీలోని ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలు సంబరంగా సాగాయి. 11వ సారి జెండా ఎగరేసిన ప్రధానమంత్రి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశం స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికి ఈ దేశం ఎప్పటికీ రుణ పడి ఉంటుందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. అలాంటి స్వాతంత్య్ర ప్రేమికులకు నివాళి అర్పించే రోజు ఇది అని అన్నారు. 


40 కోట్ల మంది బానిస సంకెళ్లు తెంచారు- మనం అభివృద్ధి సాధించలేమా: ప్రధాని మోదీ
స్వాతంత్య్రానికి ముందు రోజులg గుర్తుచేసుకుందాం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వందల ఏళ్ల బానిసత్వం. ప్రతి రోజూ ఒక పోరాటమే. స్త్రీలు, యువకులు, గిరిజనులు ఇలా అందరూ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. 1857 స్వాతంత్ర్య పోరాటానికి ముందు కూడా చాలా గిరిజన ప్రాంతాల్లో స్వాతంత్ర్యం కోసం పోరాటాలు జరిగాయి. స్వాతంత్ర్య సంగ్రామం చాలా సుదీర్ఘమైనది. చిత్రవధ, నిరంకుశ పాలన, సామాన్యులను తమవైపు తిప్పుకునేందుకు చేసిన కుయుక్తులు, అయినా సరే ఐ టైంలో సుమారు 40 కోట్ల మంది ఉన్న స్వాతంత్య్ర కాంక్షను వీడలేదు. తమ శక్తిని చూపించారు. ఒక లక్ష్యంతో కలతో ముందుకు సాగారు. దేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఒక్కటే మంత్రం వందేమాతరం అంటూ నినదించారు. 


సర్జికల్ స్ట్రైక్‌తో యువకుల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది: ప్రధాని మోదీ
దాడులు చేసి దాక్కునే ఉగ్రవాదులను వెతికి మరీ మట్టుబెట్టే దమ్మున్న దేశం మనది. దేశ సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు యువకుల ఛాతీ గర్వంతో నిండిపోయిది. ఇవి దేశప్రజల హృదయాల్లో గర్వాన్ని నింపింది. కరోనా సంక్షోభాన్ని మరిచిపోలేమని ప్రధాని మోదీ అన్నారు. 


15 కోట్ల కుటుంబాలు జల్ జీవన్ మిషన్ ప్రయోజనం: ప్రధాని మోదీ
జల్ జీవన్ మిషన్ కింద 12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీరు అందుతోందన్నారు మోదీ. 15 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయని తెలిపారు. పేదలు, దళితులు, అణగారిన, గిరిజనలు అందరికీ ఈ పథకం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. 


ఇలాంటి పోరాటయోధుల వారుసలమని చెప్పుకోవడానికి గర్విస్తున్నామని అన్నారు. 40 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలోనే అత్యంత బలమైన శక్తిని పడగొట్టారు. మన పూర్వీకుల రక్తం మన నరనరాల్లో ఉంది. నేడు మనం 140 కోట్ల మంది జనాభా. 40 కోట్ల మంది బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛగా జీవించేందుకు పోరాటం చేస్తే... 140 కోట్ల మంది పౌరులు భుజం భుజం కలిపి దృఢ సంకల్పంతో ముందుకు సాగితే నెరవేరని లక్ష్యం అంటూ లేదు. ఎన్ని సవాళ్లు వచ్చినా మనం అభివృద్ధి సాధించగలం. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేయగలం.


ఏడున్నరకు ఎర్రకోట వద్దకు చేరుకొన్న ప్రధానమంత్రి మోదీకి త్రివిధ దళాలు ఘన స్వాగతం పలికాయి. వేడుకలకు వచ్చిన అతిథులకు అభివాదం చేస్తూ నేరుగా ఎర్రకోటపైకి చేరుకున్నారు. అక్కడ జాతీయ జెండాను ఎగరవేశారు. వరుసగా 11 సార్లు జాతీయ జెండాను ఆగస్టు 15 సందర్భంగా ఎగరవేసిన కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ కొత్త రికార్డు సృష్టించారు. 


ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసే ముందు ప్రధానమంత్రి మోదీ రాజ్‌ఘాట్‌కు చేరుకొన్నారు. అక్కడ జాతిపిత మహాత్మగాంధీకి నివాళి అర్పించారు.