ఒడిశాలోని బాలోసోర్‌లో ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. బాహనాగ్‌ వద్ద పట్టాలు పునరుద్దరించిన తర్వాత ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలి గూడ్సు రైలును వెళ్లనిచ్చారు. రైల్వే మంత్రి దీన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. 


జూన్ రెండో తేదీని ధ్వంసమైన ట్రాక్‌ను పునరుద్దరించిన తర్వాత విశాఖ ఓడరేవు నుంచి రూర్కెలా స్టీల్ ప్లాంట్‌కు  వెళ్లే గూడ్స్ రైలు సర్వీస్‌ను ప్రారంభించారు. మరో రెండు రోజు ఈ మార్గాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే రెగ్యులర్‌ సర్వీస్‌లు పునరుద్దరిస్తారు. తక్కువ సమయంలోనే రైలు మార్గాన్ని పునరుద్దరించిన సిబ్బందిని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అభినందించారు. 










యుద్ధప్రాతిపదికన పనులు 
ప్రమాదం జరిగిన బహనాగ్‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పై పడి ఉన్న రైలు బోగీలను తొలగించే పనులు ముమ్మరంగా సాగాయి. ట్రాక్ పై పడి ఉన్న రైలు బోగీలను ముక్కలు ముక్కలుగా పడి ఉన్న ఎక్స్ ప్రెస్ రైలు బోగీలన్నింటినీ తొలగించారు. పట్టాలు, విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణ పనులు ముమ్మరంగా చేపట్టారు. ప్రమాదం జరిగిన బాలాసోర్ జిల్లాలోని బహనాగ్‌ ప్రాంతంలో 51 గంటల తర్వాత రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ భావోద్వేగానికి గురై చేతులు జోడించి రైలుకు నమస్కరించారు.


ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ ఆచూకీ తెలియని వారిని వీలైనంత త్వరగా గుర్తించి వారి కుటుంబాలకు చేరుస్తామన్నారు. దీని కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మార్గం భారత తూర్పు భాగాన్ని దక్షిణాది రాష్ట్రాలతో అనుసంధానించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఘోర ప్రమాదం జరగడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం నాటికి పునరుద్ధరించాల్సిన రైలు రాకపోకలను ఆదివారం రాత్రే పునరుద్ధరించి సేవలను ప్రారంభించారు.


ప్రమాదంపై సీబీఐ ఎంక్వయిరీ


ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోరమండల్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. సీబీఐ సమగ్ర దర్యాప్తుతో ప్రమాదానికి కారణాలు, బాధ్యులెవరో తేలుతుందన్నారు. రైలు ప్రమాదం ఘటనలో ఇప్పటికే 275 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. కొందరి డెడ్ బాడీలను గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగించగా, 170 నుంచి 180 వరకు డెబ్ బాడీలను గుర్తించలేదని, అవి కుళ్లిపోయే అవకాశం ఉండటంతో గుర్తించడం కష్టమేనని కొందరు అధికారులు భావిస్తున్నారు.


శుక్రవారం జరిగిన ఈ రైలు ప్రమాదం ప్రపంచ దేశాలను సైతం కలచివేసింది. మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు లూప్ లైన్ లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఆ తరువాత హౌరాకు వెళ్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు.. కోరమండల్ బోగీలను ఢీకొట్టడంతో భారీ విషాదంగా మారింది.


ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, పాయింట్ మెషీన్‌లో చేసిన మార్పు వల్ల రైలు ప్రమాదం జరిగిందని బాలాసోర్ జిల్లాలో ప్రమాద స్థలంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ అప్పగించాలని భావిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. రైల్వే బోర్డు తరఫున రైలు ప్రమాదం దర్యాప్తును సీబీఐ చేపట్టాలని సిఫారసు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఎవరైనా బయటి వ్యక్తులు స్టేషన్ మాస్టార్ రూములోకి వెళ్లారా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.