Nipah Cases: కేరళలో కొత్త నిఫా కేసులు వెలుగుచూడలేదు. తాజాగా కేసులేవీ నమోదు కాలేదు. హై-రిస్క్ కాంటాక్ట్ లో ఉన్న 42 నమూనాలు అన్నీ నెగెటివ్ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. నిఫా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య స్థిరంగా ఉందని, కొత్తగా కేసులేవీ నమోదు కాకపోవడంతో కాస్తంత ఉపశమం లభించినట్లు అయిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్న రోగుల్లో.. వెంటిలేటర్ పై ఉన్న తొమ్మిదేళ్ల బాలుడి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. మరిన్ని నమూనాల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని, ఈరోజు అవి వచ్చాక మరింతి స్పష్టత లభిస్తుందని తెలిపారు. 


కోజికోడ్ జిల్లాలో తాజా నిఫా వైరస్ వ్యాప్తిలో ఇప్పటి వరకు ఆరు సంక్రణ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగుకు పరిమితం అయింది. కొత్తగా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాకపోవడం వల్ల నిఫా వైరస్ పట్ల ఎంతకాలం అప్రమత్తంగా ఉండాలో ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్ నను ఉటంకిస్తూ.. చివరి పాజిటివ్ కేసు నుంచి 42 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందేనని తెలిపారు. 


వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 21 రోజులు అయినందు వల్ల చివరి పాజిటివ్ కేసు నుంచి 42 రోజుల డబుల్ ఇంక్యుబేషన్ పీరియడ్ గా పరిగణించి అప్రమత్తంగా ఉండాలని వీణా జార్జ్ పేర్కొన్నారు. 


కొవిడ్ కంటే ప్రమాదకరం.. 
నిఫా ప్రాణాంతక వ్యాధి అంటోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR. కొవిడ్​ కంటే నిఫా వైరస్ చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తోంది.నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం  చెల్లించుకోక తప్పదని వార్నింగ్‌ ఇస్తోంది. నిఫా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిని గట్టిగా చెప్పారు... ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ డాక్టర్.  రాజీవ్‌ బాల్‌. కోవిడ్ మరణాలతో పోలిస్తే నిఫా వైరస్ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. కొవిడ్‌ వైరస్‌ వల్ల 2 నుంచి 3 శాతం మరణాలు సంభవిస్తే.. నిఫా వైరస్  వల్ల 40 నుంచి 70 శాతం మరణాలు నమోదవుతాయని చెప్పారు. ప్రారంభదశలోనే నిఫా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేయాలని.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.


నిఫా వైరస్‌ బాధితులకు చేసే చికిత్సలో మోనోక్లీనల్ యాంటీబాడీ మందు ముఖ్యమైనది చెప్పారు ICMR డీజీ. అయితే.. ప్రస్తుతం తమ దగ్గర 10 మంది రోగులకు సరిపడే  మోనోక్లీనల్ యాంటీబాడీ మందు మాత్రమే ఉందన్నారు. మరో 20 డోసులను కొనుగోలు చేస్తామన్నారు. 2018 నుంచే మోనోక్లీనల్ యాంటీబాడీ మందును ఆస్ట్రేలియా నుంచి  కొనుగోలు చేస్తున్నామని చెప్పారాయన. మన దేశంలో ఇప్పటివరకు నిఫా వైరస్ రోగుల్లో ఒక్కరికి కూడా మోనోక్లీనల్ యాంటీబాడీల మందును ఇవ్వలేదు. విదేశాల్లోని 14  మంది నిఫా రోగులకు మోనోక్లీనల్ యాంటీబాడీలు ఇచ్చామని.. వారందరూ కోలుకున్నారని చెప్పారు డాక్టర్ బాల్‌. అయితే... వైరస్‌ సోకిన వెంటనే ఈ మందు ఇవ్వాలని..  అప్పుడే పేషంట్‌ కోలుకుంటాడని చెప్తున్నారు. 
 
వర్షాకాలంలోనే నిఫా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బాల్ తెలిపారు. కేరళలో ఆరు నిఫా కేసులు వెలుగుచూడంతో.. వారి చికిత్సపై కూడా  ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అయితే.. కేరళలోని నిఫా రోగులకు మోనోక్లీనల్ యాంటీబాడీలు ఉపయోగించాలనే నిర్ణయం.. వైద్యులు, రోగులు, వారి కుటుంబసభ్యులతో పాటు  కేరళ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఈ మెడిసిన్‌పై ట్రయల్స్ ఒక లెవల్‌లో మాత్రమే జరిగాయని.. ఎఫిషియన్సీ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.