Violence On Women In India: మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోతోంది. వారిపై హింస రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇన్ని కేసులు నమోదు అవుతున్నా శిక్షలు మాత్రం కేవలం 1.6 శాతం మందికే పడుతున్నాయని కేంద్రం డాటా చెబుతోంది. మినిస్టరీ ఆఫ్‌ ఇంప్లిమెంటేషన్ ఆఫ్‌ సెంట్రల్‌ స్టాటస్టిక్‌ ప్రోగ్రామ్‌ విడుదల చేసిన వివరాలు చూస్తే మాత్రం షాక్‌కి గురి చేస్తున్నాయి. భారత్‌లో మహిళలు, పురుషుల పరిస్థితి 2023 పేరుతో విడుదల చేసిన వివరాలు పరిశీలిస్తే మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.


జరిగేవి చాలానే ఉన్నా...


మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, బలవంతపు వివాహాలు, సైబర్‌ వేధింపులు, అక్రమ రవాణా ఇలా చాలా విధాలుగా పాల్పడుతున్న హింస పెరిగిపోతోందని ఈ నివేదిక చెబుతోంది. ఇలాంటి కేసుల్లో బయటకి వచ్చేవి చాలా తక్కువ అయితే.. అఁదులో కూడా శిక్షలు పడేవి ఇంకా స్వల్పం. 2022లో మొత్తం 23.67 లక్షల కేసులు విచారణకు రాగా 1.43 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. వాటిలో 1.6 శాతం కేసులో శిక్షలు ఖరారు అయ్యాయి. 4.4 శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. 2022లో ఆత్మహత్యకు పాల్పడిన వారిలో వివాహితులు పాతిక వేల మంది ఉన్నారు. తర్వాత స్థానంలో విద్యార్థినులు ఉన్నారు. వాళ్ల సంఖ్య ఆరు వేలకుపైగా ఉంది. కూలీలు మూడు వేల మంది, నిరుద్యోగులు రెండు వేల మంది, వృత్తి నిపుణులు రెండు వేల మంది ఉన్నారు. 


వాళ్లే టార్గెట్‌


అత్యాచారానికి గురవుతున్న వారిలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో కూడా పని చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడు, ఆఫీస్‌ నుంచి వస్తున్నప్పుడు మాత్రమే అత్యాచారాలు జరుగుతున్నట్టు తేలింది. రాత్రి పూట పని వేళలు, పని చేసే ప్రదేశాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017 నుంచి డాటాను పరిశీలించిన అధికారులు బంధువుల నుంచి దగ్గరి వారి నుంచి ఎదురవుతున్న హింసే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 2013లో మహిళల ఆత్మహత్యలు 44వేల 256 ఉంటే... 2022లో 48 వేల 172 రిజిస్టర్ అయ్యాయి. 2022లో అత్యాచారాల కేసులు 1,98,285 రిజిస్టర్‌ కాగా... అందులో 5.067కేసుల్లో శిక్షలు పడ్డాయి. 12,062 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల అయ్యారు.


Also Read: కోల్‌కతా కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్, నిజాలు బయటకు వస్తాయా?