Monsoon in India: నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా చేరుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటి వరకు దేశంలోని 80 శాతానికి పైగా ప్రాంతాలను చేరుకున్నాయని భారత వాతవరణ శాఖ సీనియన్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ వెల్లడించారు. రుతు పవనాలు ఆదివారం ఒకే రోజు ధిల్లీ, ముంబైకి చేరుకున్నాయి. 62 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతోందని డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. రుతుపవనాలు ముంబైకి సాధారణంగా జూన్ 11, అలాగే దిల్లీ జూన్ 27వ తేదీకి చేరుకుంటాయని తెలిపారు. అయితే దీనిని నేరుగా వాతావరణ మార్పులతో ముడి పెట్టలేమని ఆయన అన్నారు. దీనిని గుర్తించడానికి 30 నుంచి 40 సంవత్సరాల డేటా అవసరం అవుతుందని వాతావరణ శాస్త్రవేత్త చెప్పారు. 


కొత్త తరహాలో దేశానికి వచ్చిన రుతుపవనాలు


ఈ సంవత్సరం రుతు పవనాలు కొత్త తరహాలో దేశానికి వచ్చాయని డాక్టర్ నరేష్ కుమార్ అన్నారు. 'సాధారణంగా, రుతుపవనాలు అల్పపీడన జోన్ ద్వారా సక్రియం చేయబడతాయి. అల్పపీడన జోన్ వల్ల ఏర్పడి అధిక వేగవంతమైన గాలులు రుతుపవనాలు వేగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేలా చేస్తాయి. ఇది వర్షపాతాన్ని కలిగిస్తుంది' అని ఆయన చెప్పారు. పశ్చిమానికి చేరుకున్న రుతుపవనాలను అరేబియా సముద్ర నుంచి బలంగా వీచే గాలులు నెట్టివేస్తాయని వివరించారు. రుతు పవనాలు మహారాష్ట్ర మీద ఉన్నప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో మరింతగా పెరిగినట్లు ఆయన చెప్పారు. దీని ఫలితంగా ముంబై సహా మహారాష్ట్రలో వర్షాలు కురిశాయన్నారు. అదే సమయంలో అల్పపీడన జోన్ ప్రభావంతో దిల్లీతో సహా వాయువ్య భారత్ వైపు గాలులు వీచాయని, రెండు ప్రాంతాలను ఒకేసారి కవర్ చేశాయని వివరించారు.


అస్సాంలో మరికొన్ని రోజులు వానలు


అస్సాంపై మేఘాలు కమ్ముకున్నాయని, అక్కడ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని వివరించారు. రుద్ర ప్రయాగ్, ఉత్తరాఖండ్ లోని వివిధ ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. గత రెండు రోజులుగా వర్షాలు కురిసిన తర్వాత దేశంలోని అనేక నగరాలు భారీ వర్షాలు, వరదల ప్రభావాన్ని చూస్తాయని చెప్పారు. పంజాబ్, హర్యానాలో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.


Also Read: Weather Latest Update: రెండు రోజుల పాటు ఈ జిల్లాల ప్రజలు ఎక్కడకు వెళ్లినా గొడుగులు పట్టుకోవాల్సిందే


తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కావచ్చు. కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారం గరిష్ణ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు  ఉంటే... కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపల్‌పల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, కొత్తగూడెం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial