Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. మాజీ భారత్ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ తివారీ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన తివారీ, తనకు, టీఎంసీకి మధ్య ఉన్న బంధం తెగిపోయిందని టీఎంసీ అధ్యాయం ముగిసింది అని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను ఆయన బయటపెట్టారు. 

టికెట్ కోసం ఐదు కోట్లు అడిగారు

హౌరాలోని శివ‌పూర్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మనోజ్‌ తివారీకి ఈసారి పార్టీ టికెట్‌ నిరాకరించింది. దీనికి గల కారణాన్ని వివరిస్తూ, ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలంటే ఐదు కోట్లు చెల్లించాలని పార్టీ వర్గాలు తనను డిమాండ్ చేశాయని ఆయన ఆరోపించారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి తాను నిరాకరించినందునే తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. కేవలం తనకే కాకుండా, ఈ ఎన్నికల్లో దాదాపు 70 నుంచి 72 మంది అభ్యర్థులు ఒక్కొక్కరు ఐదు కోట్లు చెల్లించి టికెట్లు కొనుకున్నారని తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ మొత్తాలు చెల్లించగల వారికే టికెట్లు దక్కాయని ఆయన విమర్శించారు. 

వైఫల్యాలపై తివారీ విశ్లేషణ

అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ ఓటమి పాలైన, బీజేపీ క్లీన్‌ స్వీప్ చేసింది. ఈ ఘోర పరాజయంై తివారీ స్పందిస్తూ, పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోవడం ఏ రంగంలోనూ అభివృద్ధి జరగకపోవడం వల్లే ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. టికెట్లు కొనుక్కున్న వారిలో ఎంత మంది గెలిచారో ఒకసారి పరిశీలించాలని ఆయన సవాల్ చేశారు. 

Also Read: మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?

మంత్రిపదవి ఒక లాలీపాల్‌

మమతా బెనర్జీ ప్రభుత్వంలో క్రీడా శాఖ సహాయ మంత్రిగా పని చేసిన తివారీ, తన పదవిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి తనకు కేవలం ఒక లాలీపాల్ లాంటిదని, దానికి ఎటువంటి అధికారాలు లేవని ఆయన వాపోయారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, కనీసం సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తే సమయం లేదని మమతా బెనర్జీ తనను వారించే వారని గుర్తు చేసుకున్నారు. 

Also Read: రాజీనామా చేసే ప్రశ్నే లేదు - మేము ఓడిపోలేదు - తేల్చేసిన మమతా బెనర్జీ

క్రీడా మంత్రిపై అసహనం 

రాష్ట్ర కేబినెట్ క్రీడా మంత్రి అరూర్‌ బిస్వాస్‌పై కూడా తివారీ తీవ్ర విమర్శలు చేశారు. క్రీడల గురించి ప్రాథమిక అవగాహన లేని వారు మంత్రిగా ఉండటం బాధాకరమన్నారు. క్రీడా మంత్రికి ఉన్న అభద్రతా భావం వల్ల తనను కనీసం వేదికలపైకి ఆహ్వానించే వారు కాదని తివారీ ఆరోపించారు. మెస్సీ కోల్‌కతా పర్యటనకు వచ్చిన సందర్భంగా జరిగిన గందరగోళంపై స్పందిస్తూ అదక విఫల ప్రయోగమని, సామాన్య ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?

రాజకీయాలకు గుడ్‌బై, క్రికెట్‌వైపు అడుగులు 

రాజకీయాలకు స్వస్తి పలికిన మనోజ్ తివారీ, తిరిగి క్రికెట్‌వైపు అడుగులు వేస్తున్నారు. బీసీసీఐ లెవల్‌2 కోచింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఆయన బెంగాల్ రంజీ జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.  

Also Read: బెంగాల్ పోరులో శక్తి స్వరూపాలు- అరాచకంపై సామాన్యుల సమరభేరి - ఈ ముగ్గురు ఎమ్మెల్యేలది చరిత్ర!