Three ordinary women victims won as BJP MLAs:  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఒక చారిత్రాత్మక మలుపుకు వేదికైంది. ధనబలం, అంగబలం, అధికార గర్వం ఉప్పెనలా విరుచుకుపడినా.. సామాన్య మహిళల సంకల్పం ముందు అవి తలవంచక తప్పలేదు. రాజకీయ నేపథ్యం లేకపోయినా, కేవలం బాధితుల పక్షాన నిలబడి, వ్యవస్థలోని అన్యాయాన్ని ఎదిరించిన ముగ్గురు మహిళలు ఈ ఎన్నికల్లో  నారీ శక్తి కి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచారు. సందేశ్‌ఖాలీ బాధితురాలు రేఖా పాత్ర, ఆర్జీ కర్ బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్, శ్రమజీవి కలితా మాఝీ సాధించిన విజయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

సందేశ్‌ఖాలీ గళం.. అసెంబ్లీలో ప్రతిధ్వని 

సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అరాచకాలకు వ్యతిరేకంగా మొట్టమొదట గళమెత్తిన ధీరవనిత రేఖా పాత్ర . కేవలం ఒక సాధారణ గృహిణిగా ఉంటూ, అధికార పార్టీ నాయకుల అకృత్యాలను ఎండగట్టిన ఆమె ప్రయాణం అసాధారణం. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రేఖను అణచివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆమె వెనకడుగు వేయలేదు.  సుమారు 5,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, అణచివేతకు గురైన వేలాది మంది మహిళల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారు. 

న్యాయం కోసం మాతృమూర్తి పోరాటం - రత్న దేబ్‌నాథ్ 

ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అమానవీయ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై అలుపెరుగని పోరాటం చేసిన  రత్న దేబ్‌నాథ్ , కేవలం బాధితురాలి తల్లిగా మిగిలిపోకుండా ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగారు. అధికార యంత్రాంగం సాక్ష్యాలను తారుమారు చేస్తోందన్న ఆరోపణల మధ్య, ఆమె ప్రజల కోర్టులో న్యాయం కోరారు. అధికార పార్టీ అభ్యర్థిపై 28,000 ఓట్ల భారీ మెజారిటీ  సాధించడం బెంగాల్ రాజకీయాల్లో ఒక ప్రకంపన.  ఈ గెలుపు కేవలం రాజకీయ విజయం కాదు, వ్యవస్థలోని కుళ్లుపై ప్రజలు వేసిన బలమైన చెంపదెబ్బ అన్న అభిప్రాయం సామాన్యుల్లో వినిపిస్తోంది. 

కష్టజీవి   కలితా మాఝీ ఇప్పుడు ఎమ్మెల్యే

ఇళ్లలో పనిమనిషిగా జీవనం సాగించే  కలితా మాఝీ ప్రస్థానం ఒక స్ఫూర్తి పాఠం. రాజకీయ వర్గాల బెదిరింపులకు భయపడకుండా, తనను ఉపాధికి దూరం చేసిన శక్తులపైనే ఆమె గెలిచి చూపించారు. పనిమనిషిగా ఉంటూనే ప్రజాప్రతినిధిగా ఎదగడం ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని చాటిచెప్పింది. 12,000 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించిన కలిత, కష్టజీవుల గళాన్ని చట్టసభలకు తీసుకెళ్లబోతున్నారు. అధికార మదంతో సామాన్యులను అణచివేయలేరని కలిత విజయం స్పష్టం చేసింది.   

 ప్రజాస్వామ్య విజయం! 

ముగ్గురు మహిళల గెలుపు బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. భయం రాజ్యమేలుతున్న చోట ధైర్యం తోడైతే, సామాన్యులు సైతం అజేయమైన శక్తులుగా మారుతారని ఈ ఫలితాలు చాటుతున్నాయి.  ఓటు  అనే ఆయుధంతో సామాన్య పౌరుడు ఎంతటి విప్లవాన్నైనా తీసుకురాగలడనే నిజాన్ని ఈ  బెంగాల్ యోధులు నిరూపించారు. రేఖా పాత్ర, రత్న దేబ్‌నాథ్ , కలితా మాఝీ.. ఈ ముగ్గురూ భారతీయ జనతా పార్టీ తరపునే పోటీ చేసి విజయం సాధించారు.