Maharashtra NCP Crisis: 


అజిత్‌ పవార్‌పై ఫైర్..


మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటుతో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) తనదే అని అని అజిత్ తేల్చి చెబుతున్నారు. ఆ పార్టీ పేరు, గుర్తుని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. శరద్ పవార్ మాత్రం ససేమిరా అంటున్నారు. న్యాయ పోరాటానికీ సిద్ధమయ్యారు. అంతే కాదు. రిటైర్‌మెంట్‌పై అజిత్ పవార్ చేసిన కామెంట్స్‌కి గట్టి బదులిచ్చారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


"నేనింకా ముసలివాడిని కాలేదు" అని స్పష్టం చేశారు. అంతే కాదు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ చేసిన కామెంట్స్‌ని ప్రస్తావించారు. తానింకా రిటైర్ అవ్వలేదని అన్నారు. అయినా వాళ్లెవరు నేను రిటైర్ అవ్వాలని చెప్పడానికి. నాకింకా పని చేసే శక్తి ఉంది"


- శరద్ పవార్, NCP చీఫ్ 


ముంబయిలో ప్రత్యేక సమావేశాలు..


ఇటీవల ముంబయిలో తన మద్దతుదారులతో ఇద్దరు పవార్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే అజిత్ పవార్ శరద్ పవార్‌పై విమర్శలు చేశారు. ఆయన మీటింగ్‌ పెట్టడం అనైతికం అని, పార్టీని అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలోనూ ఇదే విధంగా ప్రవర్తించారని మండి పడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని ప్రఫుల్ పటేల్ తన పేరుని ప్రతిపాదించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు. NCPలో రాజకీయ వారసత్వాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. దీనికీ గట్టిగానే సమాధానం చెప్పారు శరద్ పవార్. 


"యూపీఏలో ఉన్నప్పుడు ప్రఫుల్ పటేల్ ఓడిపోయినప్పటికీ..మంత్రి పదవి ఇచ్చాం. పీఏ సింగ్మా కూతురికి కేంద్రమంత్రి పదవి దక్కింది. సుప్రియా సూలేకి ఇంక ఆ అవకాశమే రాలేదు. అలాంటప్పుడు వారసత్వ రాజకీయాలు అని అజిత్ పవార్ ఎలా చెప్పగలరు..? ఇది ముమ్మాటికీ తప్పే"


- శరద్ పవార్, NCP చీఫ్ 


మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. శరద్ పవార్‌ రిటైర్ అవ్వరా..? అంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రిటైర్‌మెంట్ ఉండదని తేల్చి చెప్పారు. ఆయన చెప్పినంత మాత్రాన శరద్ పవార్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అని ప్రశ్నించారు. 


"అజిత్ పవార్ చెప్పినంత మాత్రాన శరద్ పవార్ వెంటనే రిటైర్ అయిపోతారా..? అయినా ముసలితనం రాగానే పక్కకు తప్పుకోవాలా..? రాజకీయాల్లో రిటైర్‌మెంట్ అనేదే ఉండదు"


- లాలూ ప్రసాద్ యాదవ్, RJD చీఫ్ 


అజిత్ పవార్ కామెంట్స్‌కి సుప్రియా సూలే కూడా కౌంటర్ ఇచ్చారు. ఆయన వయసుపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని తేల్చి చెప్పారు. 


"పెద్దలు పిల్లలకు ఆశీర్వాదాలు ఇవ్వాలని కొందరు ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్లు ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి..? టాటాకి ఇప్పుడు 86 ఏళ్లు. అమితాబ్ బచ్చన్‌కి 82 ఏళ్లు. వాళ్లు ఇప్పటికీ ఉత్సాహంగా పని చేయడం లేదా?"


- సుప్రియా సూలే, NCP వర్కింగ్ ప్రెసిడెంట్


Also Read: Forex Reserves: భారత ఖజానాకు ఫారిన్‌ కరెన్సీ కళ, $595.1 బిలియన్లకు ఫారెక్స్‌ అకౌంట్‌ జంప్‌