Maharashtra Political Crisis: గత వారం రోజులుగా రసవత్తరంగా సాగుతోన్న మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్ చేరే దిశగా నడుస్తోంది. శివ‌సేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు భాజపా వేగంగా పావులు కదుపుతోంది. మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌కు దిల్లీ నుంచి పిలుపు వచ్చింది.






షాతో భేటీ


మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలు, భాజపా కార్యాచరణ గురించి చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫడణవీస్ భేటీ కానున్నారు. ఇప్పటికే ఫడణవీస్ నివాసంలో రాష్ట్ర భాజపా కోర్ క‌మిటీ భేటీ అయింది. అనంత‌రం ఆయ‌న భాజపా అగ్ర‌నాయ‌క‌త్వాన్ని క‌లిసేందుకు దిల్లీ పయనమయ్యారు.


వారికి మంత్రి పదవులు


మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన షిండే  వర్గానికి కీలక పదవులు ఇవ్వాలని కాషాయ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భాజపా, శివసేన తిరుగుబాటు నేత షిండే వర్గం మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై అగ్రనేతలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవడానికే ఫడణవీస్ దిల్లీ వెళ్లారని సమాచారం.


సుప్రీంలో ఊరట


శివసేన రెబల్​ ఎమ్మెల్యే షిండే వర్గానికి సుప్రీం కోర్టులో ఇటీవల ఊరట లభించింది. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలపై జులై 11 వరకు అనర్హత వేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోద్దని డిప్యూటీ స్పీకర్​కు సుప్రీం కోర్టు సూచించింది. రెబల్​ ఎమ్మెల్యేల వర్గంలోని మొత్తం 39 మందితో పాటు వారి కుటుంబసభ్యులు, ఇళ్లు, ఆస్తులకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


డిప్యూటీ స్పీకర్ పంపిన నోటీసులకు జులై 11 సాయంత్రం ఐదున్నరలోగా సమాధానం చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేసింది.


ఠాక్రేకు షాక్


మహారాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి విశ్వాస పరీక్షలకు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది.


Also Read: Heat Wave In Tokyo: జపాన్‌లో భానుడి బ్యాటింగ్‌- 150 ఏళ్ల రికార్డ్ బద్దలు!


Also Read: Joe Biden Greets PM Modi: మోదీ భూజం తట్టి ఆప్యాయంగా పిలిచిన బైడెన్- వైరల్ వీడియో చూశారా?