Karnataka Woman News: కర్ణాటకలో ఓ మహిళ ఏడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం ఇప్పుడు సంచలనంగా అయింది. ఆమె గత ఆరు సంవత్సరాల్లోనే ఏడుగురిని పెళ్లి చేసుకుంది. ఏడో భర్తతో కూడా విడాకులు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేయగా.. న్యాయమూర్తి ఆ పిటిషన్ చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


తన ప్రతి భర్తతో విడాకులు తీసుకోవడం కోసం ఆమె ఏకంగా గృహ హింస కేసులు, వేధింపుల కేసులను అక్రమంగా మోపేదని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. అలాగే ఏడో భర్తతోనూ విడాకుల కోసం తప్పుడు కేసులను మోపింది. ఈ సమయంలో ఆమె అసలు విషయం బయటికి వచ్చింది. ఆమె ఏడో భర్త నిందితురాలి అసలు గుట్టంతా బయట పెట్టారు. 


సదరు మహిళ ప్రతిసారి సంపన్నులైన యువకులకు వల వేసి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఏడాదిలోపే వారి నుంచి విడాకులు తీసుకోవడం లాంటి పనులు చేసేది. ప్రతిసారి భర్తలపై గృహ హింస కేసులు, వేధింపుల కేసులను నమోదు చేసి విడాకులు పొందడం అలవాటుగా మార్చుకుంది. అలా విడాకులు పొందే క్రమంలో భర్తల నుంచి భారీగా భరణం రూపంలో సొమ్ము పొందుతూ ఉండేది. 


‘‘కర్ణాటకలో ఓ మహిళ ఏడు సార్లు పెళ్లి చేసుకుంది. ఏడాదికో పెళ్లి చొప్పున ఏడుగురు యువకులను పెళ్లి చేసుకుంది. ఒక్కొక్కరితో సంవత్సరం కంటే ఎక్కువగా కాపురం చేయలేదు. అందరి మీద 498ఏ సెక్షన్ కింద వరకట్న వేధింపుల కేసులు పెట్టింది. గత ఆరుగురు భర్తల నుంచి భారీ సొమ్ము డిమాండ్ చేసింది. ఇప్పుడు ఏడో భర్తతో అలాగే విడాకుల కోసం ప్రయత్నిస్తోంది’’ అని కర్ణాటకలోని ప్రాంతీయ మీడియా కథనాలు రాసింది. 


ఏడో భర్తతో విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తి ఎదుటకు రాగా.. ఆయన అవాక్కయ్యారు. ఆ మహిళ తీరును న్యాయమూర్తి సోమవారం ఖండించారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడమంటే.. అందులో మీ తప్పే కనిపిస్తోంది అని మహిళను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు.