Karnataka Shakti Yojana: 


ఇవాళ్టి నుంచే..


కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 హామీల్లో కీలకమైంది...మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. "శక్తి యోజనే" (Shakti Yojane) పథకంలో భాగంగా ఇది అమలు చేస్తామని చెప్పారు సీఎం సిద్దరామయ్య. ఇవాళ (జూన్ 11న) అధికారికంగా ఈ స్కీమ్‌ని ప్రారంభించారు. బెంగళూరులోని విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఈ పథకాన్ని లాంఛ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డినరీ బస్‌లలో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు. కర్ణాటక రవాణాశాఖ మంత్రి రామలింగా రెడ్డి ఇదే విషయాన్ని వెల్లడించారు. 


"కర్ణాటక వ్యాప్తంగా మహిళలు సౌకర్యవంతంగా ప్రయాణించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. షార్టేజ్‌ ఉన్న మార్గాల్లో బస్‌ల సంఖ్యను తప్పకుండా పెంచుతాం. ఇవాళ మధ్యాహ్నం (జూన్ 11) ఒంటిగంట నుంచి మహిళలందరూ ఉచితంగా బస్‌లలో ప్రయాణించొచ్చు"


- రామలింగా రెడ్డి, కర్ణాటక రవాణా మంత్రి 


మూడు నెలల్లో మహిళలందరూ శక్తి స్మార్ట్ కార్డ్స్ ( Shakti Smart Cards) కోసం అప్లై చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కార్డ్‌లతో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. అయితే...మహిళల వ్యక్తిగత సమాచారం ఈ కార్డ్‌లలో ఉంటుంది కనుక...ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదముందన్న వాదనలు వినిపించాయి. దీనిపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. డేటా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా...కార్డ్స్‌ని తయారు చేసినట్టు స్పష్టం చేసింది. 






"మహిళలంతా శక్తి స్మార్ట్‌ కార్డ్స్‌ కోసం అప్లై చేసుకోండి. డేటా ప్రైవసీ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అదంతా ఆలోచించే అందుకు తగ్గట్టుగానే కార్డులు తయారు చేశాం. మరో మూడు నెలల పాటు పోర్టల్ అందుబాటులో ఉంటుంది. కార్డ్ తీసుకునే లోపు మహిళలు ప్రభుత్వ గుర్తింపు కార్డుని చూపించి ఉచితంగా ట్రావెల్ చేయొచ్చు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి కూడా ఈ స్కీమ్ అమలవుతుంది"


-  రామలింగా రెడ్డి, కర్ణాటక రవాణా మంత్రి 






ఈ శక్తి స్కీమ్ కేవలం ఆర్డినరీ బస్‌లకు (BMTC) మాత్రమే వర్తించనుంది. వేరే రాష్ట్రానికి ట్రావెల్ చేసే వాళ్లకు ఈ స్కీమ్‌ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. KSRTC, KKRTCకి చెందిన బస్‌లలో 50% సీట్లు పురుషులకే కేటాయించింది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళలు ఈ స్కీమ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ...ప్రభుత్వం మాత్రం తాము ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు స్పష్టం చేసింది. 


Also Read: పెట్రోల్‌ డీజిల్‌పై వ్యాట్ పెంచిన ప్రభుత్వం, ఇకపై మరింత భారం