Jawaharlal Nehru's Wife Budni Passed away: భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భార్య 'బుద్నీ మేజాన్' (85) నాలుగు రోజుల క్రితమే కన్నుమూశారు. అదేంటీ..! ఆయన భార్య ఇంకా బతికే ఉన్నారా.? అని ఆశ్చర్యపోతున్నారా.! అయితే ఈ కథ మీకు తెలియాల్సిందే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని అయిన నెహ్రూ దశలవారీగా వ్యవసాయం, ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి సారించారు. అలా 1959లో ధన్ బాద్ దగ్గర దామోదర నదిపై పంచట్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. అది పూర్తై ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ వచ్చారు. అయితే, డ్యాం నిర్మాణంలో అక్కడి స్థానికులైన సంథాల్ తెగకు చెందిన చాలా మంది కూలీలుగా శ్రమించారు. నెహ్రూకి ఆ కృతజ్ఞతగా ఉండగా, ఆయన స్టేజ్ మీదకు రాగానే స్వాగతం పలకటానికి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అధికారులు సంథాల్ తెగకు చెందిన ఓ 15 ఏళ్ల అమ్మాయిని స్టేజ్ మీదకు పిలిచారు. ఆమె పేరే 'బుద్నీ'. అప్పటికే ఆమె ఓ కార్మికురాలిగా పంచట్ డ్యామ్ నిర్మాణంలో పని చేశారు. స్టేజ్ మీదకు 'బుద్నీ' వచ్చి నెహ్రూకి బొకే ఇచ్చి వెళ్లిపోతుండగా ఆయన ఆపారు. డ్యామ్ ప్రారంభించే బటన్ ను బుద్నీతోనే నొక్కించారు. సంథాల్ తెగ కష్టానికి ఇదే సరైన గుర్తింపు అని నెహ్రూ ప్రకటించారు. అయితే, స్వాగతం పలుకుతున్న క్రమంలో నెహ్రూ తన మెడలోని ఓ పూలమాలను తీసి 'బుద్నీ' మెడలో వేశారు. అప్పటికే 70 ఏళ్లు నిండిన నెహ్రూ 15 ఏళ్ల అమ్మాయి మెడలో అలా పూలమాల అలంకరించడం తప్పని అనిపించలేదు. అధికారులు సైతం చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించారు.


తెగ ఆచారంతో


అయితే, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత 'బుద్నీ' ఇంటికి వెళ్లే సరికి పరిస్థితులు మారిపోయాయి. సంథాల్ తెగ పెద్దలంతా సమావేశమై బుద్నీకి నెహ్రూతో పెళ్లి జరిగిపోయినట్లేనంటూ ఓ తీర్మానాన్ని పెట్టారు. సంథాల్ తెగ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకోబోయే వరుడే ఆడపిల్ల మెడలో పూలమాల వేయాలి. అంటే నెహ్రూతో 'బుద్నీ'కి పెళ్లి అయిపోనట్లే. పైగా పెళ్లి చేసుకున్న నెహ్రూ సంథాల్ తెగకు చెందిన వ్యక్తి కాకపోవటంతో 'బుద్నీ' కూడా ఇకపై సంథాల్ తెగతో కలిసి నివసించే హక్కును కోల్పోయిందంటూ ఆమెను గ్రామం నుంచి వెలివేశారు. పొరుగు గ్రామానికి చెందిన ఓ మహిళ 'బుద్నీ'ని చేరదీశారు. అయితే, అప్పుడు సమాచార వ్యవస్థ సరిగ్గా లేక ఈ విషయాలేవీ నెహ్రూ వరకూ చేరలేదు. 1964లో నెహ్రూ కన్ను మూశారు. కానీ అంతకంటే రెండేళ్ల ముందే అంటే 1962లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ 'బుద్నీ'ని ఉద్యోగం  నుంచి కారణాలు కూడా చెప్పకుండా తొలగించింది. తన ఉద్యోగం కోసం పోరాటం మొదలుపెట్టిన బుద్నీ సుదీర్ఘ కాలం పాటు తన హక్కు కోసం తిరగని ప్రదేశమంటూ లేదు. ఆమెకు తర్వాత పెళ్లైంది. పిల్లలు పుట్టినా తన పోరాటం మానలేదు. ఆఖరికి 1980లో నెహ్రూ మనవడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని కలిసే అవకాశం ఆమెకు వచ్చింది. తన కథనంతా 'బుద్నీ' ఆయనకు చెప్పగా, ఆశ్చర్యపోయిన ఆయన అధికారులను పిలిపించి ఆమె ఉద్యోగం ఆమెకు ఇవ్వాలని సూచించారు. అలా బుద్నీ మళ్లీ ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఆమె కథ చరిత్రలో కలిసిపోయింది. చాలా మంది ఆమె చనిపోయి ఉంటారని భావించారు.


నవలగా 'బుద్నీ' కథ


అయితే, 'బుద్నీ' కథను 2018లో తొలిసారి విన్న మలయాళం రచయిత సారా జోసఫ్, దామోదర్ వ్యాలీ అధికారులతో మాట్లాడి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మాజీ ఉద్యోగుల ద్వారా బుద్నీ జార్ఖండ్ లోనే ఉన్నట్లు తెలుసుకుని ఆమెను స్వయంగా కలిశారు. ఈ క్రమంలో 'బుద్నీ' తాను నెహ్రూను తొలిసారి కలిసినప్పటి ఫోటోల నుంచి మొదలుపెట్టి తన జీవితంలో జరిగిన విషయాలన్నీ వివరించారు. దీంతో సారా జోసఫ్ ఆమె కథను 'బుద్నీ' పేరు మీదగానే నవలగా ముద్రించారు. 2005లో ఉద్యోగ విరమణ తీసుకున్న బుద్నీ 85 ఏళ్ల వయస్సులో కార్డియాక్ అరెస్ట్ తో నాలుగు రోజుల క్రితం కన్నుమూశారు. వరల్డ్ కప్ ఫీవర్ లో ఉన్న భారత్, ఈ వార్తను పెద్దగా పట్టించుకోలేదు. అధికారులు కూడా ఎప్పట్లానే ఆమె ఎవరో తెలియదన్నట్లుగానే ఉన్నారు. కానీ, చరిత్ర అవునన్నా కాదన్నా తను చేయని తప్పునకు ఆమె నెహ్రూకు భార్యగానే బతికారు.  కన్నుమూశారు.