Jammu Kashmir Election 2024 Phase 2 : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. 26 స్థానాల్లో 239 మంది పోటీలో ఉంటే... వారి భవిష్యత్‌ను దాదాపు 25 లక్షల మంది ఓటర్లు నిర్ణయిస్తున్నారు. ఈ దశలో జరిగే పోలింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ (జెకెపిసిసి) అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు రవీంద్ర రైనా బరిలో ఉన్నారు.  


6 జిల్లాల పరిధిలో 26 సీట్లకు పోలింగ్ నడుస్తోంది. వీటిలో మూడు జిల్లాలు కాశ్మీర్ డివిజన్‌లో ఉండగా, మరో మూడు జిల్లాలు జమ్మూ డివిజన్‌లో  ఉన్నాయి. ఎన్నికలను సజావుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపేందుకు ఎన్నికల సంఘం భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,502 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. పట్టణ ప్రాంతాల్లో 1,056 పోలింగ్‌ కేంద్రాలు ఉంటే... గ్రామీణ ప్రాంతాల్లో 2,446 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 


కాశ్మీరీ పండిట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు,
ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఓట్లు వేసేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది ఎన్నికల సంఘం. ప్రతి పోలింగ్ స్టేషన్ చుట్టూ భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండో దశ పోలింగ్‌లో 15,500 మంది కశ్మీరీ పండిట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారు 24 పోలింగ్ స్టేషన్‌లలో ఓటు వేయనున్నారు. సెంట్రల్ కాశ్మీర్‌లోని శ్రీనగర్, బుద్గామ్, గందర్‌బల్ జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో తమ హక్కును వినియోగించుకుంటారు.
అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సౌకర్యం ఉంది. ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు రెండో విడత పోలింగ్‌ కోసం 157 ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 26 'పింక్ పోలింగ్ స్టేషన్లు' అంటే ఇక్కడ పూర్తిగా మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారు. మరో 26 పోలింగ్ స్టేషన్లు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశారు. 31 సరిహద్దు పోలింగ్ స్టేషన్లు, 26 గ్రీన్ పోలింగ్ స్టేషన్లు, 22 ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 


ప్రధాన అభ్యర్థులు ఎవరు?
నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ (జెకెపిసిసి) అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రవీంద్ర రైనా ఈ దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కీలకమైన నేతలు. అబ్దుల్లా గండేర్బల్, బుద్గామ్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. సెంట్రల్ షాల్టెంగ్ నుంచి తారిఖ్ హమీద్ కర్రా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014లో గెలిచిన రాజౌరి జిల్లాలోని నౌషెరా నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు రైనా.  


పోటీలో వేర్పాటువాద నేత సర్జన్ అహ్మద్ వేజ్‌:
లోక్‌సభలో ఇంజనీర్ రషీద్ నమోదు చేసిన రికార్డును పునరావృతం చేయాలని భావిస్తున్నారు వేర్పాటువాద నాయకుడు సర్జన్ అహ్మద్ వేజ్ అలియాస్ బర్కతీ. ఈ దశలో ఆయన కూడా పోటీలో ఉన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిపై బారాముల్లా నుంచి రషీద్ విజయం సాధించారు. రషీద్ ఇంజనీర్‌గా ప్రసిద్ధి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ తీహార్ జైలులో ఉంటూనే  బారాముల్లా నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షలకుపైగా ఓట్లతో విజయం సాధించారు. అదే స్ఫూర్తితో బీర్వా, గందర్‌బల్ అనే రెండు స్థానాల నుంచి బర్కతి పోటీ చేస్తున్నారు. 


తొలి దశలో పోలింగ్‌ ఎంత?
జమ్మకాశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 18న జరిగిన తొలి దశ ఓటింగ్‌లో 61.38 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో మూడో, చివరి దశ ఓటింగ్ అక్టోబర్ 1న జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.  


Also Read: ఇండియాలో మహిళా ఉద్యోగులపైనే అత్యధిక పని ఒత్తిడి - ఆఫీసులో రోజుకు 10 గంటలు !