కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అదానీ స్కాం, కుల గణన, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అంతరాల్లో పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిందని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో బీజేపీ సర్కార్ విఫలమైందని జైరాం రమేశ్ విమర్శించారు.  గణాంకాలను ఎంత సవరించినా.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఆర్థిక పరిస్థితులను మాత్రం దాచిపెట్టలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరుగుతున్నాయన్న ఆయన, జనవరి నుంచి కంది పప్పు ధరలు 45 శాతానికి పైగా పెరిగాయన్నారు జైరాం రమేశ్. మొత్తంగా పప్పు దినుసుల ద్రవ్యోల్బణం 13.4 శాతానికి చేరిందని గుర్తు చేశారు. ఆగస్టు నుంచి పిండి ధరలు 20 శాతం పెరిగాయని, బెల్లం, చక్కెర ధరలు సైతం ఎగబాకుతున్నాయని వెల్లడించారు. నిత్యావసరాల ధరలు నియంత్రణ లేకుండా పెరగడమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 


కొవిడ్‌-19 మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను బయటపడేయడంలో ప్రభుత్వం విఫలమైందని, తాము ముందు నుంచి చెబుతున్నామని జైరాం రమేశ్ తెలిపారు. ఆర్‌బీఐ విడుదల చేసిన 2023 సెప్టెంబర్‌ బులెటిన్‌ను చూస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. 2020 ఫిబ్రవరిలో 43 శాతం మంది ప్రజలు శ్రామిక శక్తిలో ఉన్నారని, మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా ఆ సంఖ్యలో పెద్దగా మార్పు లేమీ కనిపించడం లేదని స్పష్టం చేశారు. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ నివేదిక ప్రకారం 2021-22లో 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో 42 శాతం మందికి ఉపాధి కరువైందన్నారు. 


ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారి విధానం కారణంగా ఆర్థిక ఫలాలన్నీ ఎంపిక చేసిన కంపెనీలకే వెళ్తున్నాయని జైరాం రమేశ్ ఆరోపించారు. ఫలితంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పోటీ పడలేకపోతున్నాయని విమర్శించారు. ప్రైవేట్‌ సెక్టార్‌కు ఇచ్చే రుణాలే వృద్ధికి ఊతమిస్తాయని, 2004 నుంచి 2014 మధ్య ఈ రుణాల్లో స్థిర వృద్ధి నమోదైనట్లు వరల్డ్‌ బ్యాంక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. 2021లో దేశీయ రుణాల్లోని వృద్ధి 2014తో పోలిస్తే 51 శాతం తగ్గిందన్నారు జైరాం రమేశ్.