International Yoga Day:


పంజాబ్‌లో భారీ ఉత్సవం..


యోగా చుట్టూ తిరుగుతున్నాయి పలు రాష్ట్రాల రాజకీయాలు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా...పార్టీలన్నీ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. పెద్ద ఎత్తున యోగ దినోత్సవాన్ని జరిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. అన్ని చోట్లా ఎలా ఉన్నా...పంజాబ్‌లో మాత్రం "యోగా రాజకీయాలు" ఆసక్తికరంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఘనంగా ఈ ఉత్సవాన్ని జరపాలని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీళ్లతో పాటు పలువురు కీలక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కానున్నారు. జూన్ 20వ తేదీనే భారీగా ఈ ఈవెంట్‌ని నిర్వహించాలని ఆప్ సిద్ధమవుతోంది. ఇందుకోసం దాదాపు 15 వేల మందితో వేడుకలు జరపనున్నారు. జలంధర్‌లోని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే రోజున పంజాబ్‌లోని 5 నగరాల్లో యోగా క్లాసెస్‌ని ప్రారంభించనున్నారు. సంగూర్, జలంధర్, హోషియార్‌పూర్, మొహాలీలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇద్దరు యోగా నిపుణులతో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సారి మధ్యప్రదేశ్‌లో పెద్ద ఎత్తున యోగా దినోత్సవం జరపనున్నారు. అంతకు ముందు రోజే పంజాబ్‌లో ఆప్‌ ప్లాన్ చేసుకుంది. 


యోగశాలలు ప్రారంభం..


గత నెల పటియాలాలో అరవింద్ కేజ్రీవాల్ యోగశాల ప్రారంభించారు అరవింద్ కేజ్రీవాల్. అక్కడే కాదు. ఫగ్వారా, అమృత్‌సర్, లుథియానాలోనూ ఈ యోగశాలలు అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా పంజాబ్‌లోని అన్ని జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఈ అన్ని కేంద్రాల్లోనూ ఉచితంగా యోగ శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వాళ్లు మిస్డ్ కాల్‌ ఇవ్వాలని ఓ నంబర్‌ని కూడా విడుదల చేశారు. ఫోన్ నంబర్, అడ్రెస్ పంపితే ట్రైనర్స్ వచ్చి ఫ్రీగా శిక్షణ ఇస్తారు. 


ఐదేళ్లలో క్రేజ్.. 


గత అయిదేళ్లుగా యోగాను అనుసరించే వారి సంఖ్య చాలా పెరిగింది. నిజానికి యోగా ఇప్పటిది కాదు, ప్రపంచంలోని పురాతన శాస్త్రాలలో యోగా ఒకటి. పురాణాలలో యోగా జ్ఞానాన్ని అందించిన మొదటి వ్యక్తి శివుడిని ప్రస్తావిస్తారు. ఇప్పటికి చాలా శివుడి వాల్ పేపర్లు ఆయన ఒంటికాలిపై నిల్చుని నమస్కరిస్తున్నట్టు ఉంటాయి. అది కూడా యోగా భంగిమే. ఇక చరిత్రలో యోగా గురుగా పతంజలి మహర్షి పేరే చెబుతారు. యోగా పుట్టుక వెనుక కథలు ప్రచారం ఉన్నాయి. అన్ని కథలు చెప్పేది మాత్రం ఒకటే యోగా జన్మస్థలం భారతదేశమే. ఇక్కడ్నించే ప్రపంచ దేశాలకు పరిచయం అయింది ఈ అద్భుత శాస్త్రం. యోగా గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటేందుకు ప్రతి ఏడాది జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నిర్వహిస్తారు. యోగా మూలాలు 5000 ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశంలో కనిపెట్టారు. యోగా అనే పదం మొదట రుగ్వేదంలో ప్రస్తావించినట్టు చెబతారు. 


Also Read: ప్రియురాలిని హత్య చేసిన యువకుడు, డెడ్‌బాడీని ట్యాంక్‌లో దాచి మిస్సింగ్ అంటూ డ్రామా