Jharkhan Rape Victim Comments : సామూహిక అత్యాచారంపై స్పెయిన్ మహిళ (Spain Women) కీలక వ్యాఖ్యలు చేశారు. నేరాలకు పాల్పడి వారినే నిందిస్తానన్న ఆమె... భారతీయులు (Indians )చాలా మంచి వారని కితాబిచ్చారు. ఆరు నెలల పాటు భారతదేశాన్ని చుట్టేశామన్న బాధితురాలు... ఎక్కడా ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. ఛేదు అనుభవం ఎదురైనప్పటికీ... భర్తతో కలిసి ప్రపంచ యాత్రను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.


భారత్ లో ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయి
దేశంలో 20 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించామని.... భారత్ లో ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయని వెల్లడించారు. ఇండియన్స్ ఎంతో మంచివారన్న ఆమె,  ప్రజలపై ఎటువంటి ఫిర్యాదులు లేవన్నారు. అత్యాచార ఘటనలో ప్రజలను నిందించాల్సిన అవసరం లేదని,  నేరస్థులను మాత్రమే నిందిస్తానన్నారు. ఆరునెలల పాటు భారతీయులు బాగా చూసుకున్నారని స్పష్టం చేశారు. ఇండియా నుంచి నేపాల్ కు బయలుదేరే స్పెయిన్ కు చెందిన అత్యాచార బాధితురాలు ముందు మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు మరచిపోవద్దన్న స్పెయిన్ మహిళ,  గతాన్ని వదిలేసేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలని సూచించారు. 


పోలీసులు వేగంగా స్పందించారన్న విదేశీ జంట
బైక్ పై ప్రపంచ యాత్ర చేస్తున్న స్పెయిన్ జంట....పశ్చిమ బెంగాల్ టూర్ ముగించుకొని జార్ఖండ్ లోకి ఎంటరయ్యారు. దుమ్కా జిల్లాలో అందమైన ప్రదేశం కనిపించడంతో రోడ్డు పక్కన తాత్కాలికంగా టెంట్ వేసుకున్నారు. అక్కడే రాత్రికి నిద్రకు ఉపక్రమించారు. భర్తతో కలిసి తాత్కాలిక గుడారంలో ఉన్న ఆమెపై స్థానిక యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జార్ఖండ్ లో జరిగిన గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఝార్ఖండ్‌ అసెంబ్లీలో ఈ దారుణంపై తీవ్ర దుమారం రేగింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు... మరో నలుగురి కోసం గాలింపు చేపట్టారు. బిహార్‌ మీదుగా నేపాల్‌ బయలుదేరిన ఆమె.. తన భర్తతో కలిసి ప్రపంచయాత్ర కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారని బాధితురాలి భర్త వెల్లడించారు. పోలీసు పెట్రోలింగ్ యూనిట్ రాత్రి రోడ్డు పక్కన ఉన్న జంటను చూసి... చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించింది. నిందితులు మద్యం మత్తులో స్పెయిన్ మహిళపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. విదేశీ దంపతుల నుంచి రూ.10 వేల నగదు, బంగారు ఉంగరం దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.


ముగ్గురు నిందితులు అరెస్ట్, నలుగురి కోసం తీవ్రంగా గాలింపు
నిందితులు రాజన్ మరాండీ, ప్రదీప్ కిస్కు, సుఖ్‌లాల్ హెంబ్రామ్‌లను దుమ్కా కోర్టులో హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 164 కింద వారి వాంగ్మూలాలను కోర్టులో నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు ముగ్గురికి వైద్య పరీక్షలు చేయించారు. సిఐడి, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బృందాలు..అత్యాచారం కేసులో కీలక ఆధారాలు సేకరించాయి. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మమతా కుమారి బాధితురాలిని పరామర్శించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, ఇక్కడి శాంతిభద్రతల పరిస్థితిని బయటపెట్టిందన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులు...విచారణలో నేరాన్ని అగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.